కొత్త జంట కలలను చిదిమేసిన ట్రాక్టర్: పెళ్లై నాలుగు రోజులకే కబళించిన మృత్యువు
నవ దంపతులను ఓ ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ ప్రమాదం ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
శ్రీకాకుళం: ఎన్నో కలలు, ఆశలు, ఊసులతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టినవారి జీవితం నాలుగు రోజులకే ముగిసింది. ఎంతో సంబరంగా కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఒక్కటైన ఆ నవ దంపతులను ఓ ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఈ ప్రమాదం ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో
చోటు చేసుకుంది.

సంబరంగా వేణు-సుభద్రల వివాహం
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలోని బెల్లుపడ కాలనీలో ఉంటున్న గవలపు వేణు అలియాస్ సింహాచలం(26) రత్తకన్న వద్ద బట్టల షాపులో పనిచేస్తున్నాడు. ఇతనికి ఒడిశా రాష్ట్రంలోని బ్రహ్మపురకు చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక(23)తో వివాహం సింహాచలం క్షేత్రంలో ఫిబ్రవరి 10న బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.

కొత్త జంటకు ట్రాక్టర్ రూపంలో ఎదురొచ్చిన మృత్యువు
ఆ తర్వాత ఫిబ్రవరి 12న ఆదివారంనాడు ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు. కుటుంబసభ్యులు, బంధువులు వచ్చి నవదంపతులను ఆశీర్వదించారు. పెళ్లి వేడుకలు ముగియడంతో.. అత్తారింటికి తిరిగి వెళ్లేందుకు సోమవారం ఇచ్చాపురం నుంచి బైక్పై వారిద్దరూ బయల్దేరారు. అయితే, గొళంత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ట్రాక్టర్ వీరి బండిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సుభద్ర ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. బ్రహ్మపుర ఆస్పత్రికి తరలించగా.. వేణు అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

నవ దంపతుల మృతితో రెండు కుటుంబాల్లో తీరని విషాదం
బ్రహ్మపురలో ఎదురుచూస్తున్న వధువు కుటుంబసభ్యులు నవదంపతుల మరణవార్త విని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇటు వేణు కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వేణు తండ్రి రామారావు గతంలోనే చనిపోగా.. అన్నయ్య, అక్క, అమ్మతో కలిసి ఉంటున్నాడు. నవదంపతుల మృతితో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఎంతో సంబరంగా, ఆనందంగా వివాహం చేసి పంపిస్తే.. విగత జీవులయ్యారంటూ రోదిస్తున్నారు. స్థానికులు కూడా నవదంపతుల మృతి విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications