నందమూరి వారసురాలి గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్గా ఎంట్రీ ఫిక్స్!
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని త్వరలోనే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేయబోతున్నారనే వార్త నెట్టింటి తీవ్రదుమారం రేపుతోంది. టాలీవుడ్కు పరిచయం అయ్యేందుకు తేజస్విని ఓ పవర్ఫుల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ఎంచుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని.. అన్ని వివరాలు కొలిక్కి వచ్చిన వెంటనే త్వరలోనే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
స్పోర్ట్ డ్రామాను ఎంచుకున్న తేజస్విని
సాధారణంగా నందమూరి కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాలు కమర్షియల్, మాస్ అంశాలతో కూడి ఉంటాయి. కానీ తేజస్విని మాత్రం దానికి భిన్నంగా ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని ఎంచుకోవడం విశేషం. కేవలం రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు పరిమితం కాకుండా.. నేటి యువతకు స్ఫూర్తినిచ్చేలా ఓ ప్రేరణాత్మకమైన స్పోర్ట్స్ మూవీగా దీనిని తెరకెక్కించేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నిజానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ముందుగా హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తారని అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కానీ ఊహించని విధంగా మోక్షజ్ఞ కంటే ముందే తేజస్విని వెండితెరకు పరిచయం కాబోతుందనే వార్త రావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య కూతురు తేజస్విని ఎంట్రీపై టాలీవుడ్ తో పాటు నందమూరి అభిమానుల్లోనూ విపరీతమైన క్రేజ్ నెలకొంది. సంప్రదాయ కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా తొలి చిత్రంతోనే ఓ బలమైన సందేశాన్ని ఇచ్చే స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకోవడం ఆమె డెసిషన్ మేకింగ్ కు అద్ధం పడుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.














Click it and Unblock the Notifications