విపక్ష నేతలు ఏపీలో ఉండరా ? నయా ట్రెండ్- అడిగితే..
ఏపీలో గత కొన్నేళ్లుగా ఓ ట్రెండ్ కొనసాగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనూ ఉంటూ అన్నీ అనుభవిస్తున్న నేతలు.. ఓసారి అధికారం కోల్పోతే మాత్రం రాష్ట్రంలో ఉండేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. గతంలో జగన్ ఫాలో అయిన ఈ ట్రెండ్ ను ఆ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫాలో కాగా.. ఇప్పుడు తిరిగి జగన్ దాన్నే కొనసాగిస్తున్నారు. ఇవన్నీ చూస్తున్న జనం మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.
రాష్ట్ర విభజనకు ముందు అధికార పార్టీ నేతలైనా, విపక్ష నేతలైనా హైదరాబాద్ లోనే ఉండే వారు. హైదరాబాద్ లో ఉంటే తప్ప తమను ఎవరూ గుర్తించరన్న భయమో, లేక అధికార కేంద్రానికి దగ్గరగా ఉంటే పనులు అవుతాయనే ఆలోచనో, మరే ఇతర కారణాలతోనే హైదరాబాద్ లోనే వీరు కనిపించేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. అప్పటివరకూ హైదరాబాద్ లోనే ఉన్న నేతలంతా ఏపీకి రాకుండా అక్కడే ఉండిపోవడం మొదలుపెట్టారు.

ఓటుకు నోటు కేసు బయటికి రాకుండా ఉంటే చంద్రబాబు హైదరాబాద్ నుంచే ముఖ్యమంత్రిగా ఐదేళ్ల ఏపీ పాలన పూర్తి చేసేసేవారు. అయితే మధ్యలో ఈ కేసు తర్వాత ఏపీకి వచ్చేసిన ఆయన ఉండవల్లి నివాసంలోనే ఉండేవారు. 2019 వరకూ చంద్రబాబు ఉండవల్లి నివాసంలోనే ఉంటే .. విపక్ష నేతగా ఉన్న జగన్ మాత్రం హైదరాబాద్ లోనే ఉండిపోయారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఇక తాను ఇక్కడే ఉంటానంటూ జగన్ వచ్చేశారు.
ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ తాడేపల్లి నుంచే పూర్తిగా పాలన సాగించడంతో పాటు ఐదేళ్లూ ఇక్కడే ఉన్నారు. కానీ విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మధ్యలో ఏపీకి వచ్చి పోవడం మినహాయిస్తే అన్నీ హైదరాబాద్ నుంచే కొనసాగించారు. తిరిగి 2024 ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే ఏపీకి రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో చంద్రబాబు, పవన్ ఇక్కడే కనిపిస్తున్నారు. తిరిగి జగన్ మాత్రం బెంగళూరు వెళ్లిపోతున్నారు. మధ్యలో మాత్రం ఏపీకి వచ్చి వెళ్తున్నారు. దీంతో వీరిలో ఎవరిని అడిగినా తమ ప్రత్యర్థులు మాత్రం రాష్ట్రంలో ఉన్నారా అని అడిగే పరిస్ధితి.












Click it and Unblock the Notifications