ఏపీలో కొత్తగా మరో 60 కరోనా పాజిటివ్ కేసులు: గుజరాత్, కర్ణాటకల నుంచి వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 60 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్, కర్ణాటకల నుంచి స్వస్థలాలకు చేరిన వారిలో 12 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1777కు చేరింది. ఇందులో 1012 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
ఐఎన్ఎస్ జలాశ్వ..విశాఖతో లింకు: గల్ఫ్లో చిక్కుకున్న వారి కోసం ఈ మూడు యుద్ధనౌకలను పంపడం వెనుక..
కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో మొత్తం 17 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తమ తాజా బులెటిన్లో వెల్లడించారు. కృష్ణా జిల్లాలో 14, గుంటూరు జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 12 మందికి, కర్ణాటక నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. వారిని ఇతరులు జాబితాలో చేర్చారు. విశాఖపట్నం జిల్లాలో రెండు, తూర్పు గోదాావరి, కడప జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు.
ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1777 కాగా.. ఇందులో యాక్టివ్గా ఉన్నవి 1012. 729 మంది కరోనా వైరస్ పేషెంట్లు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 36 మంది చనిపోయారు. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కరోనా మరణాలు నమోదు అయ్యాయి. కర్నూలులో 11, కృష్ణాలో 10, గుంటూరులో ఎనిమిది మంది మృతి చెందారు. కర్నూలు జిల్లాలో 153 మంది డిశ్చార్జి అయ్యారు. గుంటూరు-12, కృష్ణా-117 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం అనంతపురం-80, చిత్తూరు-82, తూర్పు గోదావరి-46, గుంటూరు-363, కడప-90, కృష్ణా-300, కర్నూలు-533, నెల్లూరు-92, ప్రకాశం-61, శ్రీకాకుళం-5, విశాఖపట్నం-39, పశ్చిమ గోదావరి 59 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలానికి చేరిన వారిలో 27 మందికి వైరస్ సోకింది. వారంతా వేర్వేరు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల్లో గుజరాత్ నుంచి వచ్చిన వారిలోనే అత్యధికంగా 26 కేసులు ఉన్నట్లు చెప్పారు.