రఘు ఇంట్లో రూ.500 కోట్ల అక్రమాస్తులు, కళ్లు తిరిగేలా ఆభరణాలు, ఇదీ ఆస్తుల చిట్టా
ఏపీ రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగం సంచాలకులు జివి రఘు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఏసీబీ ఆయన ఇంట్లో సోమవారం తనిఖీలు చేపట్టింది.
అమరావతి: ఏపీ రాష్ట్ర పట్టణ ప్రణాళికా విభాగం సంచాలకులు జివి రఘు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఏసీబీ ఆయన ఇంట్లో సోమవారం తనిఖీలు చేపట్టింది. ఏసీబీ చరిత్రలోనే దాదాపు అతి పెద్ద అవినీతి తిమింగలాన్ని పట్టారు. కనీవినీ ఎరుగని అక్రమ సంపాదన.
అన్ని ఆస్తులా?: అధికారుల మైండ్ బ్లాంక్.. టౌన్ ప్లానింగ్ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
ఈ సోదాల్లో 15 ఏసీబీ బృందాలు పాల్గొన్నారు. సోమవారం రూ.500 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. తవ్వుతున్న కొద్దీ అక్రమాస్తులు బయటపడుతుండటంతో అధికారులు విస్తుపోతున్నారు.
ఇదీ ఆస్తుల చిట్టా
గుంటూరు జిల్లా మంగళగిరిలో రఘు నివాసం ఉంటున్న ఇంట్లో రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ శివారులోని బొమ్మలూరులో 1033 చదరపు అడుగుల ఇంటి స్థలం, గుంటూరు జిల్లా మంగళగిరిలోని కండపేని లే అవుట్లో 220 చ.అ. ఇంటి స్థలం గుర్తించారు. రూ.5.5 లక్షల విలువ చేసే హ్యుండాయ్ కారు గుర్తించారు.
భార్య పేరిట కూడా, షిరిడిలో ఆస్తులు
రఘు భార్య పేరిట బొమ్మలూరులో 1033 చదరపు అడుగుల ఇంటి స్థలం, కృష్ణా జిల్లా వేల్పూరులో రెండెకరాల ఆరు సెంట్ల వ్యవసాయ భూమి, కుమార్తె పేరిట చిత్తూరు జిల్లా పులివెల్లంలలో 428 చదరపు అడుగుల రెండు ఇళ్ల స్థలాలు ఉన్నట్టు గుర్తించారు. అత్త పేరిట విశాఖలో 167 చ. అ. ఇంటి ప్లాటు, షిరిడి సాయి సురాజ్కుంజ్ పేరిట డూప్లెక్స్ ఇల్లు, లాడ్జి ఉన్నట్టు కనుగొన్నారు. గన్నవరం రాఫిన్ కాలనీలో ఎనిమిది ప్లాట్లు ఉన్నాయి. మంగళగిరి వద్ద 220 గజాల స్థలం. మామిడితోట ఉంది. మాదాపూర్లో ప్లాట్.
ఇంట్లోను భారీగా..
ఇంట్లో 200 గ్రాముల బంగారు ఆభరణాలు, సుమారు రూ.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రఘు కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు లాకర్లను పరిశీలించారు. ఇతర చర, స్థిరాస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. గుంటూరు నగర శివారులోని గోరంట్లలో పురపాలక శాఖ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకులుగా రఘు విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ రఘు నేపథ్యం
రఘు 1988 మే 11న అసిస్టెంట్ డైరెక్టర్గా పట్టణ, కంట్రీ ప్లానింగ్ విభాగంలో విధుల్లో చేరారు. అనంతపురం, నెల్లూరు, విశాఖలలో పనిచేశారు. 2015 నుంచి రాష్ట్ర టౌన్, కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో విజయవాడ, మంగళగిరి తదితర ప్రాంతాల్లో 15 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు
పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా కనిపించనంత బంగారాన్ని అధికారులు రఘు వద్ద గుర్తించారు. ఒక్కో నగ రూ.కోటి కూడా ఉంది. చెవిదుద్దులు రూ.లక్షా పాతిక వేలవి ఉన్నాయి. నగల జాబితా జ్యువెల్లరీ షాపును తలపించేలా ఉంది.