రాష్ట్రపతి భవన్లా అసెంబ్లీ: డిజైన్లు ఇవ్వబోయేది ఈ సంస్థలే, 12 నెలల్లో నిర్మాణం
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మించే అసెంబ్లీ భవనం, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ ఎన్.శ్రీకాంత్ పేర్కొన్నారు. రాజధానిలో నిర్మించే అసెంబ్లీ భవన డిజైన్ల కోసం ప్రపంచంలోని మూడు ఆత్యుత్తమ ఆర్కిటెక్ట్ బృందాల మధ్య పోటీ పెట్టినట్టు ఆయన తెలిపారు.
రాజధాని అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల్లో అసెంబ్లీ, హైకోర్టు ప్రపంచ స్థాయి నిర్మాణంలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రపంచంలోని ఐదు ఆత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలను గుర్తించామన్నారు. వీటిలో మూడింటిని పరిగణనలోకి తీసుకున్నామన్నారు.
నార్మన్ పోస్టర్, పాస్టర్ ప్లస్ పార్టన్స్, రోజర్ స్టర్క్ హార్పర్ ప్లస్ లాంటి సంస్థలు అత్యుత్తమ ఆర్కిటెక్ట్ సంస్థలు కావడంతో వాటికి ఈ రెండు భవనాల డిజైన్లను తయారు చేయాలని సూచించామన్నారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో నిర్మితమయ్యే అన్ని భవనాలు కూడా అమరావతి సంస్కృతి, చరిత్ర, ఆధునికత ఉట్టిపడే విధంగా తయారు చేయాలని సూచించామన్నారు.

ఈ నెలాఖరకు డిజైన్లు సమర్పించనున్నారు. ఈ మూడు సంస్థలు తయారు చేసిన డిజైన్లను ముగ్గురు సభ్యుల ఆర్కిటెక్ట్ల జ్యూరీ ఎంపిక చేస్తుందని తెలిపారు. ఈ జ్యూరీలోనూ దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్లు ఉన్నారన్నారు. డిజైన్ ఎంపిక చేయడానికీ పలు ప్రమాణాలను నిర్దేశించామన్నారు.
పోటీలో ఉన్న ఈ మూడు సంస్థలకు అత్యద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందన్నారు. జర్మన్ పార్లమెంటు భవనం, స్పెయిన్లోని బిల్బావొలో ఉన్న గెగెన్హీమ్ మ్యూజియాన్ని ఈ సంస్థలే డిజైన్ చేశాయన్నారు. గెగెన్హీమ్ మ్యూజియం ఏర్పాటు తర్వాత బిల్బావొ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారిందన్నారు.
ప్రభుత్వం ఆమోదం తెలిపిన తుది డిజైన్ను రూపొందించేందుకు ఆయా సంస్థకు 12 నెలల సమయం పడుతుందన్నారు. ఇక ప్రభుత్వ భవనాల సముదాయంలోని మిగిలిన సచివాలయం, రాజ్భవన్ ఇతర కట్టడాల డిజైన్ల తయారీ బాధ్యతను దేశంలోని ప్రముఖ ఆర్కిటెక్ట్లకు అప్పగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications