ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్: బడ్జెట్ ప్రతిపాదన ఆమోదానికే
అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 20 లేదా 21వ తేదీల్లో అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలను ఒకట్రెండు రోజుల్లోనే ముగించేస్తారని తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదింపజేసుకోవడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్లు సమాచారం. మార్చిలోనే ఈ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వాయిదా వేసింది. మూడు నెలల కాలానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్డినెన్స్ ద్వారా ఆమోదింపజేసుకుంది.
వచ్చేనెల ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగుల వేతనాలు, ఇతరత్రా ఆర్థిక అవసరాలకు సంబంధించిన బడ్జెట్ అవసరాలను కూడా ఆర్డినెన్స్ ద్వారానే ఆమోదింపజేసుకుంది ప్రభుత్వం. ఇక పూర్తి కాలానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనల కోసం అధికార పార్టీ వచ్చేనెలలో అసెంబ్లీని సమావేశపరుస్తుందని మొదట భావించారు. దానికి భిన్నంగా ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా- ఈ నెల 20 లేదా 21వ తేదీ నాడు శాసన సభ, శాసన మండలిని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ సారి అసెంబ్లీ సమావేశాలు రెండు లేదా మూడు రోజులకు మించకపోవచ్చని తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించిన వెంటనే నిరవధికంగా వాయిదా వేస్తారని అంటున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి శాసన సభ, శాసన మండలి ధన్యవాదాలు తెలుపుతాయి. ఇటీవలి కాలంలో కన్నుమూసిన కడప జిల్లా బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య, చల్లా రామకృష్ణ రెడ్డికి సంతాపం ప్రకటిస్తాయి. రెండోరోజు బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన అనంతరం వాటిని ఆమోదిస్తారని సమాచారం.