ఇంకేం చేస్తాం: యనమల, జగన్ పార్టీ ఎమ్మెల్యేకు క్లాస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించి, ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కాగా, సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరు పైన అధికార పక్షం, సభాపతి కోడెల శివప్రసాద రావు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సూచనలు చేశారు.
స్పీకర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చామని,ఆయన సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సభలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవారిని సస్పెండ్ చేయకపోతే మరేం చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్కు చెవిరెడ్డి క్షమాపణ చెబితే వివాదం సమిసిపోవచ్చన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రతిపక్షం ఎత్తి చూపితే స్వాగతిస్తామన్నారు.
రేపు రాజమండ్రిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'జన్ ధన్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, దీని ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చన్నారు. ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండటమే జన్ ధన్ పథక ఉద్దేశమన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ వేస్తామన్నారు. కృష్ణా జిల్లా నందిగామ ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీతో మాట్లాడాల్సింది ఏమీ లేదని, కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించిందన్నారు.
రుణమాఫీపై ఏకిపారేసిన జగన్
రుణమాఫీని ప్రభుత్వం తగ్గించుకోవాలని చూస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫీకి బడ్జెట్లో కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించారని, రూ.87వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయన్నారు. అలాగే రూ.14వేల కోట్ల డ్వాక్రా రుణాలు ఉన్నాయన్నారు. ఎన్నికలప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.
మరోవైపు, సభలో రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. తర్వాత కొద్దిసేపటికే జ్యోతుల నెహ్రూ తిరిగి సభలోకి వచ్చారు. దీంతో, ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ.. వాకౌట్ చేసి తిరిగి సభలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. వాకౌట్ అంటే అర్థం ఏమిటని ఆయన ప్రతిపక్ష సభ్యులకు చురక అంటించారు.
జ్యోతుల నెహ్రూకు సభాపతి కోడెల శివప్రసాదరావు క్లాసు పీకారు. ఒక అంశాన్ని నిరసిస్తూ వాకౌట్ చేసిన వారు.. మళ్లీ అదే అంశంపై సభలో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధమని స్పీకర్ తెలిపారు. వాకౌట్ చేసిన వారు సభలో కూర్చుంటే అభ్యంతరం లేదని, వాకౌట్ చేయలేదని చెప్పి మాట్లాడవచ్చన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాకౌట్ చేసింది. అయితే, జ్యోతుల నెహ్రూ మాత్రం సభ గేటు దాకా వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చి మాట్లాడటానికి ప్రయత్నించారు. దీంతో, టీడీపీ సభ్యులు నెహ్రూపై సెటైర్లు విసిరారు.
రాష్ట్రానికి దశదిశ నిర్దేషించేలా ఏపీ బడ్జెట్ ఉందని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నారు. విభజనలో సమన్యాయం జరగలేదని, సంక్షోభంలో ఉన్న ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు.