బాబు 'ఉప' ప్లాన్: లోకేష్పై తొందర లేదా, వైసిపి నుంచి వచ్చిన వారిలో ఎవరికో?
విజయవాడ: త్వరలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీలో కొన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలకు జరగాల్సి ఉన్నఎన్నికల తర్వాతే దీనిని చేపట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.
కీలకమైన ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరు అంచనా వేసి మంత్రివర్గ విస్తరణ జరపాలని భావిస్తున్నారట. తొమ్మిది జిల్లాల పరిధిలో ఏడు కార్పొరేషన్లు.. విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, గుంటూరు, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం, నాలుగు మున్సిపాలిటీలు.. రాజంపేట, కందుకూరు, నెల్లిమర్ల, రాజాంలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. త్వరలో వీటిని జరపాలని భావిస్తోంది.
కొన్ని జిల్లాల్లో ఏకగ్రీవం కానున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం పోటీ జరగనుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా అవి అక్కడి వరకే పరిమితమయ్యాయి. రాష్ట్రం మొత్తం ప్రభావం తెలుసుకునే విధంగా జరుగుతున్న ఎన్నికలు మాత్రం ఇవే.
ఈ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు కేబినెట్లో చోటుకు గీటురాయిగా చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ దిశలో దృష్టి సారించారని అంటున్నారు.
ఎన్నికలకు ముందే విస్తరణ జరిపితే చాలామంది ఉత్సాహంగా పని చేయరని, ఎన్నికల తర్వాతే ఉంటుందంటే ఎవరికి వారు తమ సత్తా చూపడానికి పోటీపడతారని కొందరు సీనియర్లు ముఖ్యమంత్రికి సూచించారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు విస్తరణను ఈ ఎన్నికల తర్వాతకు వాయిదా వేశారని తెలుస్తోంది.
చంద్రబాబులో మంత్రివర్గ విస్తరణ యోచన నేపథ్యంలో.. పలువురు ముఖ్యమంత్రి చుట్టు తిరుగుతున్నారు. దసరా నాటికి విస్తరణ ఉంటుందని అంటున్నారు.
మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఎవరికి చోటు దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. నారా లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి పదవి పైన ఆశతో వచ్చారు.
అందులో భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్ తదితరులు ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందోనని చూస్తున్నారు. ఇదిలా ఉండగా, లోకేష్ను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబుకు లేదా లోకేష్కు తొందర లేదని మరికొందరు అంటున్నారు.