మంత్రుల పనితీరుపై ప్రతీ నెలా సర్వే: రాజధాని తరలింపుపై చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక రాష్ట్ర మంత్రుల పనితీరుపై దృష్టిసారించనున్నారు. ప్రతినెలా మంత్రుల పనితీరుపై సర్వే చేయిస్తామని, ప్రభుత్వ పథకాల తీరుపై కూడా సర్వే చేపడతామని సిఎం చంద్రబాబు చెప్పారు.
శనివారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 9 నుంచి రైతు కోసం యాత్రలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది.

వ్యవసాయానికి పగటిపూట 7 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కార్యాలయాల తరలింపు వేగవంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మచిలీపట్నం పోర్టుకు భూ సమీకరణ చేపట్టాలని, భూసేకరణ పద్ధతుల్లో భూములు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. రైతులు కోరిన పద్ధతుల్లో 14 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు.
1300 కోట్ల రూపాయలతో ఈ ప్రగతి ప్రాజెక్టును పీపీపీ మోడల్లో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రుణమాఫీ విజయయాత్రలపై, రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పల్లె రఘునాథ్
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కాపులపాడులో ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ సిటీకి 1750 ఎకరాలు కేటాయించినట్లు ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాకు మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించారు.

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరవలో సప్తగిరి పవర్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్కు 9 ఎకరాల 96 సెంట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2010లో మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్కు పోర్టు అభివృద్ధికి అనుమతిచ్చారని చెప్పారు. 5,324 ఎకరాలు భూసేకరణ జరపాల్సి ఉండగా 524 ఎకరాలు మాత్రమే సేకరించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications