రాజధానిపై సీఎంకు ఒత్తిళ్లు: అక్కడేనంటూ నివేదికలు
విజయవాడ: 'ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని విషయంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు, వివిధ వర్గాల నుండి ఒత్తిళ్లు రావడంతో.. ఆ రెండు జిల్లాలను సంతృప్తి పరచాల్సిన అవసరం ఉందని, ఆ రెండు జిల్లాలలను ఆనుకుని కృష్ణా నదికి రెండు వైపులా రాజధాని నిర్మించేలా ఆలోచన చేద్దాం. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న భూములపై మరోసారి సమగ్ర సర్వే చేయించి వీలైనంత త్వరగా నివేదికలు అందజేయండి' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మంత్రులు, రెండు జిల్లాల కలెక్టర్లతో పేర్కొన్నట్లు సమాచారం.
రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మంగళవారం ముఖ్యమంత్రిని కలసి రెండు జిల్లాల్లో ప్రభుత్వ, అటవీ భూములను వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృష్ణానదికి ఇరువైపులా భూసేకరణ సర్వే నిర్వహించాలని సూచించినట్లు సమాచారం.
గుంటూరు జిల్లాలోని అమరావతి, అచ్చంపేట, మంగళగిరి, కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, ఇబ్రహింపట్నం, కొండపల్లి ప్రాంతాల దిశగా రాష్ట్ర రాజధాని నిర్మాణం సాగే అవకాశముందని అధికార వర్దాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ (నిడ్) ఏర్పాటు కోసం కృష్ణా తీరం వెంట 50 నుంచి 60 ఎకరాల భూమి ఒకే చొట ఉండే స్దలాన్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు రఘునందనరావు, కాంతిలాల్ దండేలను ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇక కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలోనే రాజధాని ఏర్పాటు చేయడానికి అమరావతి, అచ్చంపేట, ప్రాంతాలు అనువైనవిగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కృష్ణా నది మీదుగా రెండు కిలోమీటర్ల దూరం హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తే గుంటూరు- కృష్ణా జిల్లాలను కలిపేయవచ్చని ప్రభుత్వం భావిస్తొందని సమాచారం.
అచ్చంపేట పరిసర ప్రాంతాల్లో 3,000 ఎకరాలకు పైగా, కృష్ణా జిల్లాలోని గుడిమెట్ల, చందర్లపాడు ప్రాంతాల్లో మరో 3,000 ఎకరాల దాకా ప్రభుత్వ, అటవీ భూములు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి పులిచింతల ప్రాజెక్టు నుంచి గానీ, కృష్ణా నది నుంచి గానీ నీటిని తేలికగా తీసుకురావచ్చునని.. రైతుల నుంచి భూములు సేకరించాల్సి వచ్చినా తక్కువ ధరకు 60:40 ప్రాతిపదికన చేయవచ్చునని అధికారులు నివేదిక అందించినట్లు సమాచారం.
ఇక అచ్చంపేట నుంచి గన్నవరం విమానాశ్రయం 95 కిలోమీటర్లు, నందిగామ 30 కిలో మీటర్లు, జగ్గయ్య పేట, సత్తెనపల్లి, మంగళగిరి, అమరావతి, నరసరావు పేట పట్టణాలు 50 కిలో మీటర్లు దూరంలోనే ఉంటాయని వివరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications