ఇంకా నాది 2 కళ్ల సిద్ధాంతమే, విభజనపై అదే: తెలంగాణపై బాబు, స్పీచ్ పూర్తి పాఠం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పండుగ అయిన మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ప్రాంతీయ పార్టీగా ఉండి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ టీడీపీయే అన్నారు. టీడీపీ ఎప్పుడు విలువలకు, క్రమశిక్షణకు మారుపేరన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు త్యాగాలు చేశారని, అలాంటి వారిని తాను జీవితంలో మరిచిపోలేనని చెప్పారు.
పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీ మాత్రమే అన్నారు. ఎంతోమంది కార్యకర్తలను, నేతలను పొట్టన పెట్టుకున్నారని, కొందరు నాయకులను కొనుక్కున్నారని అన్నారు. ఒకరిద్దరు పార్టీ నుండి వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.
మనది ఓ కుటుంబ బాంధవ్యమన్నారు. మన పార్టీ నవ యవ్వనంలో ఉందని, దేశానికి ఏదైనా చేయగలిగే సత్తా ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది టీడీపీకే అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు తెచ్చామన్నారు. పక్కా ఇళ్లు, ఫుట్ సెక్యూరిటీ వంటి వాటిని నాడే ఎన్టీఆర్ చెప్పారన్నారు.
కానీ, చాలా పార్టీలు ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ గురించి చెబుతున్నాయన్నారు. టీడీపీ ఓ ట్రెండ్ సెట్టర్ అన్నారు. కార్యకర్తలకు రూ.2 లక్షల ఇన్సురెన్స్ ప్రవేశ పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం భ్రష్టు పట్టిందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో 24 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
విభజన పైన...
విభజన పైన మాట్లాడుతూ.. 2004లో సమైక్య రాష్ట్రం అని చెబుతూ ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. 2009లో తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల ప్రకారం రాష్ట్రం ఇస్తూ, ఏపీ ప్రజల మనోభావాలను గుర్తించాలని టీడీపీ చెప్పిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ భయపడిందంటే ఒక్క ఎన్టీఆర్, టీడీపీకే అన్నారు. మిగతా ఎవరికీ భయపడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మనలను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందన్నారు. రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తాను కోరానన్నారు.
రెండు ప్రాంతాలు ఉన్నాయి, రెండు ప్రాంతాలు తనను పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా గౌరవించాయని, అందుకే తాను రెండు ప్రాంతాలను రెండు కళ్లతో చూసుకుంటానని చెబితే ఎగతాళి చేశారన్నారు. ఈ రోజు కూడా తాను అదే చెబుతున్నానని చెప్పారు.
రాష్ట్ర విభజన జరిగాక ఇది మొదటి మాహానాడు అన్నారు. 2014లో మహానాడు పెట్టుకున్నప్పటికీ.. అపాయింటెడ్ డే మాత్రం జూన్ 2న వచ్చిందన్నారు.
ఈ మహానాడులో ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. ఇంతకుముందు ఏం జరిగాయో ఓసారి ఆలోచించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఏం చేయలేరన్నారు. టీడీపీ తెలుగు జాతి ఉన్నంత వరకు చిరస్థాయిగా ఉంటుందన్నారు.
టీడీపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ భావించిందని, కానీ ఏపీలో వారికి డిపాజిట్లు కూడా రాలేదని, తెలంగాణలోను గెలవలేదన్నారు. ఆ రోజు చెప్పిందే, నేను ఈ రోజు కూడా చెబుతున్నానని, రెండు ప్రాంతాలకు సమానంగా న్యాయం జరగాలన్నారు.
రెండు ప్రాంతాలను ఒక్కటిగా చేసే శక్తి కేవలం టీడీపీకే ఉందన్నారు. ఆ బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. తెలుగువారిలో అనైక్యత లేదని, స్వార్థం లేదన్నారు. తెలంగాణ ప్రజలు విభజన కోరుకున్నారు కాబట్టి దానిని గౌరవించాల్సిందే అన్నారు. అయితే, మనం మాట్లాడే భాష ఒక్కటే అన్నారు.
ఒకప్పుడు మనం సమైక్యాంధ్ర ప్రదేశ్లో అధికారంలో ఉన్నామని చెప్పారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామని, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని చెప్పారు. ఒకే సమయంలో మనం వివిధ పాత్రలు పోషిస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో కలిసి పని చేసే ప్రభుత్వం మనకు ఉందని చెప్పారు.
ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా, అభివృద్ధి జరిగేలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవలసి ఉందన్నారు. తెలంగాణ ఇవ్వండి.. అందర్నీ కూర్చుండబెట్టండి, మాట్లాడేందుకు మేం అనుకూలంగా ఉన్నామని తాము పదే పదే చెప్పినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ రాజకీయం, తెలంగాణ సర్ ప్లస్లో
అదే కాంగ్రెస్ పార్టీ రాజకీయ కారణంతో విభజన చేసిందన్నారు. అందుకే డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. హైదరాబాదు మహా నగరంగా తయారు కావడానికి టీడీపీయే కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం టీడీపీయే అన్నారు. గుజరాత్ తర్వాత సర్ ప్లస్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు.
తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ప్రతిపక్షంలో పదేళ్ల పాటు ఉన్నా మనం రాజీలేని పోరాటం చేశామన్నారు. ఒక ఆశయం పెట్టుకున్నప్పుడు దానికి అనుగుణంగా మనం పని చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే ఏడు మిషన్లు పెట్టుకున్నామని చెప్పారు.
జన్మభూమి - మా వూరి కార్యక్రమాన్ని రెండు మూడు విడతలుగా విభజించామన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసం కార్యకర్తలు పని చేయాలన్నారు. వృధా పోయే నీటిని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఏపీలో సముద్ర తీరం చాలా ఉందన్నారు. 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందన్నారు.
సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల కంటే తీర ప్రాంతాలు అయిదు రెట్లు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి వీల్లేదన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో తెలుగు జాతి నష్టపోయింది
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి సారి తెలుగు జాతి నష్టపోయిందని చెప్పారు. భూగర్భ జలాలు పెరగాలంటే నీరు చెట్టు కార్యక్రమం తప్పనిసరి అన్నారు. కాంగ్రెస్ దానిని పట్టించుకోలేదని, దానికి ఇప్పుడు మేం పూర్వవైభవం తీసుకు వస్తున్నామని చెప్పారు.
మిగులు జలాలు ఉన్నచోట నదుల అనుసంధానం చేస్తున్నామన్నారు. వ్యవసాయం బాగుంటే గ్రామాలు బాగుంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
టెక్నీలజీ..
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్ తదితరాలను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. సాంకేతికతను ఎంతగా ఉపయోగించుకుంటే అంత పారదర్శకత, అవినీతి రూపుమాపు అవుతుందన్నారు.
పని చేయని అధికారులను ఉపేక్షించం
అధికారులు పని చేయకుంటే ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించమని చెప్పారు.
రాజధాని ఎక్కడో చెప్పకుండా విభజన
విభజన సమయంలో ఏపీకి రాజధాని ఎక్కడో చెప్పకుండా విభజన చేశారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చాక ఎక్కడైతే చరిత్ర ఉంటుందో అక్కడ రాజధానిని ఏర్పాటు చేశామన్నారు. అమరావతి దగ్గర రాజధానిని ఏర్పాటు చేశామన్నారు. పేరు కూడా అమరావతి అనే మంచి పేరు పెట్టుకున్నామన్నారు. పేరు వినగానే ఒళ్లు పులకరిస్తుందని, నమ్మకం వస్తుందన్నారు.
రాజధాని కోసం భూమి కావాలని, డబ్బులు కావాలని, అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇది టీడీపీకి ఓ సదవకాశమన్నారు. తెలుగు ప్రజలు గర్వించేలా నూతన రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి సింగపూర్ లాంటి ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు. వారు మాస్టర్ ప్లాన్ తయారు చేశారన్నారు.
రైతులు ముందుకు వచ్చారు
రాజధాని కోసం భూమి అడిగితే రైతులు ముందుకు వచ్చారని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వారు భూమిని ఇచ్చారని చెప్పారు. నా జీవితంలో వారిని మరిచిపోలేనని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఇచ్చిన భూమిని టీడీపీ, నేను ఎప్పుడూ మరిచిపోలేమన్నారు. ఆ రైతులకు తప్పకుండా న్యాయం చేస్తామని నేను మరోసారి హామీ ఇస్తున్నానని చెప్పారు.
రాజధాని కట్టుకోవడం ఓ చరిత్ర అయితే, రైతులు నా పైన నమ్మకంతో భూమి ఇవ్వడం సంతోషమన్నారు. ప్రజా రాజధానిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో తెలుగు వారంతా ఈ రాజధానికి కనీసం ఒక ఇటుక లేదా ఇటుకకు సమానమయిన డబ్పులు లేదా శ్రమ విరాళంగా ఇవ్వాలని కోరారు.
టీడీపీ సిద్ధాంతం అభివృద్ధి, సంక్షేమం అన్నారు. అభివృద్ధి లేకుంటే సంక్షేమానికి విలువ లేదని, అలాగే సంక్షేమం లేకుంటే అభివృద్ధికి విలువ లేదన్నారు. టీడీపీ స్పష్టమైన విధానంతో ముందుకు పోతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం మా లక్ష్యమన్నారు.
ఓ వైపు అమరావతి, మరోవైపు కాకతీయ తీరణం.
మహానాడులో ఓ వైపుకు అమరావతిని, మరో వైపు కాకతీయ తోరణం పెట్టారని చెప్పారు. ఇది సంతోషమన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ విధానమని చెప్పారు.
రైతును ఆదుకోవాలి
మనం ఎంత కష్టపడ్డప్పటికీ రైతును ఆదుకోవాలని నిశ్చయించుకున్నామని చెప్పారు. అందుకే రుణమాఫీ చేస్తామని చెప్పి, చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ టీడీపీ అన్నారు. భారత దేశంలోనే ఇంతపెద్ద రుణవిముక్తి ఎప్పుడు జరగలేదన్నారు.
అవసరమైతే అప్పు చేసి రుణవిముక్తి చేసి, రైతుల కష్టాలు తీర్చేందుకు ముందుకు పోతున్నామన్నారు. రైతు ఆనందంగా ఉండాలన్నారు. ఏ రైతు కూడా ఇబ్బంది పడవద్దన్నది తన లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకు వచ్చామన్నారు. దేశంలోనే సబ్ ప్లాన్ పెట్టిన ఘనత టీడీపీదే అన్నారు. పేదవారు, మహిళలను కూడా ఆదుకుంటున్నామని చెప్పారు. ఇది పేదవాళ్ల ప్రభుత్వమన్నారు. ఆదాయం పెంచి పేదవారిని ఆదుకుంటామన్నారు. పేద డ్రైవర్ల కోసం ఐదు లక్షల రూపాయల బీమా పెట్టామన్నారు. అసంఘటిత కార్మికుల కోసం రూ.5 లక్షల బీమా పెట్టామన్నారు.
పెట్టుబడుల కోసం విదేశాలకు
ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సింగపూర్, జపాన్ వంటి దేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసమన్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. వీటి ద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. నాడు హైదరాబాదు కోసం దేశాలు తిరిగానని, అదే విధంగా హైదరాబాద్ అభివృద్ధి అయిందన్నారు.
ఏపీలో రెండు పార్టీలు, ఏపీ విషయంలో ఏ పార్టీతో రాజీపడం
ఏపీలో మనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే భూస్థాపితం అయిందని, అధి తిరిగి కోలుకోలేదన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకే అవినీతి పుట్టుక అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లయినా టీవీ, పత్రిక పెట్టలేకపోయామని, కానీ వారు అప్పుడే పెట్టారన్నారు. తమకు ఏ పార్టీతోను వ్యతిరేకత లేదని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీతోను రాజీపడమని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిపై సవాల్, కేసీఆర్పై నిప్పులు
తెలంగాణ అభివృద్ధిపై తేల్చుకునేందుకు తాను సిద్ధమని సవాల్ చేస్తున్నానని చంద్రబాబు సవాల్ విసిరారు. రాష్ట్రం విడిపోయినా రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు.
తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పటికీ చాలామంది కార్యకర్తలు, నేతలు కన్నతల్లిలా పార్టీని గౌరవించారన్నారు. వారి స్ఫూర్తిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నానని చెప్పారు. తెరాస మనలనే టార్గెట్ చేసుకుంటోందని, మన ఎమ్మెల్యేలను బజారులో పశువుల కంటే హీనంగా కొనుక్కునే పరిస్థితి వచ్చిందన్నారు.
ఒక్క నాయకుడు వెళ్లిపోతే వందమంది నాయకులను తయారు చేసుకునే శక్తి టీడీపీకి ఉందని చెప్పారు. తెరాస తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తోందన్నారు. ఇప్పటికీ తనది రెండు కళ్ల సిద్ధాంతమే అన్నారు.
తాను తెరాసకు విజ్ఞప్తి చేస్తున్నానని, కూర్చొని సమస్యలను పరిష్కరించుకుందామని, పెద్ద మనుషుల ఎదుట పెట్టి విభజన సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. అదీ కుదరకుంటే కేంద్రం ఎదుట పరిష్కరించుకుందామని చెప్పారు. అంతేకానీ, విభేదాలతో వచ్చేదీ ఏమీ ఉండదన్నారు. ఈ విషయాన్ని తెరాస గుర్తించాలన్నారు.
తెలంగాణలో ఉన్న సమస్యల పైన తెలుగుదేశం పార్టీ పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. అదే విషయంలో మరో విషయం గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. అధికారంలో ఉంటే పనులు వెంటనే అవుతాయని, ప్రతిపక్షంలో ఉంటే అలా కుదరదన్నారు.
నేను ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా రెండు రాష్ట్రాల కోసం మాట్లాడుతానని చెప్పారు. ఇప్పటి వరకు 34 సంవత్సరాల మన ప్రస్తానంలో కేంద్రంలో ఐదు నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నాలుగు నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలలో మనం ఉన్నామని చెప్పారు. టీడీపీ ఎప్పుడూ అధికారం కోసం పాకులాడలేదన్నారు. జాతీయస్థాయిలో మనం ముఖ్యపాత్ర పోషించామన్నారు. టీడీపీ జాతీయ భావంతో ముందుకు వెళ్లే పార్టీ అన్నారు.
మిగతా రాష్ట్రాల్లో పోటీ, మోడీ భేష్
తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. మనకు ఉన్న విశ్వసనీయతతో ఇతర రాష్ట్రాలలో పోటీ చేద్దామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయతను పెంచిందన్నారు. ఒకప్పుడు స్కాం ఇండియా అంటే, ఇప్పుడు ప్రతిష్టను తెచ్చారన్నారు.
అవినీతి డబ్బు వెలికి తీస్తా
అవినీతి
డబ్బును
వెలికితీస్తానని
చెప్పారు.
ఎర్ర
చందనం
స్మగ్లింగ్తో
వైయస్సార్
కాంగ్రెస్
పార్టీకి
సంబంధాలు
ఉన్నాయని
చెప్పారు.
ఎన్నికల
మేనిఫెస్టోను
అమలు
చేసే
బాధ్యత
తనదే
అన్నారు.
ఈ
మూడు
రోజుల
సమీక్ష
సమావేశంలో
అన్నింటిని
చర్చిస్తామన్నారు.
టీడీపీ
స్పష్టతతో
ముందుకు
పోతుందన్నారు.
అందరి
ధ్యేయం
టీడీపీ
ద్వారా
తెలుగు
రాష్ట్రానికి
మేలు
జరగడమే
అన్నారు.
కార్యకర్తల
కృషి
జీవితంలో
మరిచిపోలేనన్నారు.