నా జైలు జీవితం మరిచిపోతానా ?, తప్పు చేస్తే వదలను, చంద్రబాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నాయకులను హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే పనులు ఎవరైనా చేస్తే సహించేది లేదని, కచ్చితంగా అలాంటి నాయకులపైన చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మద్యం టెండర్లు విషయంలో జోక్యం చేసుకునే నేతల విషయంలో ఏమాత్రం సహించబోమని చంద్రబాబు అన్నారు.
కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వచ్చే వారి పైన చర్యలు తీసుకుంటానని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదని, ప్రజలకు మంచి చేయడం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తనని 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు అన్నారు.

జైలు గదిలో సీసీ కెమెరాలు పెట్టి తన కదలికలపై నిఘా వేశారని, దోమలు కుడుతుంటే కనీసం దోమతెర కూడా ఇవ్వలేదని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను జైలు నుండి బయటకు రాగానే జగన్ పైన కక్ష తీర్చుకుంటానని అందరూ అనుకున్నారని, కానీ తనకు అలాంటి స్వభావం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తనతో పాటు చాలామంది వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులతో అనేక తప్పులు చేయించారని చంద్రబాబు ఆరోపించారు. తప్పులు చేసిన అధికారులు అందరిని పక్కన పెట్టి ప్రభుత్వం నడపడం కష్టం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తప్పు చేసిన అధికారుల మీద భవిష్యత్తులో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
ప్రభుత్వ అధికారులు వాళ్ల పనులు వాళ్లు చేసుకోవాలని, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలవంచకూడదని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టమని, ఓ అధికారిని ఇంటికి పంపించామని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్య తక్కువగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.












Click it and Unblock the Notifications