Parliament: ప్రతిష్టంభనకు తెర- రేపే కీలక బిల్లుపై చర్చకు అధికార, విపక్షాలు..!
నీట్ సహా పలు జాతీయ స్థాయి పరీక్షల్లో అక్రమాల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇందులో ప్రభుత్వ పరీక్షల నిర్వహణ బిల్లులో కీలక సవరణలు చేసింది. అయితే ఈ బిల్లుపై చర్చకు ఇవాళ పార్లమెంట్ లో అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సభా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అధికార, విపక్షాలు ఏకాభిప్రాయానికి రావాలని స్పీకర్ కోరినా అంగీకరించకపోవడంతో లోక్ సభ (Lok Sabha)లో ప్రతిష్టంభన కొనసాగింది. ఈ నేపథ్యంలో తెరవెనుక అధికార, విపక్షాలు ఇవాళ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
స్పీకర్ ఓం బిర్లా సూచన మేరకు ఈ కీలకమైన బిల్లులో విపక్షాలు సూచిస్తున్న సవరణలకు అధికార ఎన్డీయే అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో రేపు మంగళవారం లోక్ సభలో ఈ బిల్లుపై చర్చ జరగబోతోంది. ఇందులో ఇండియా కూటమి తరఫున విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు ఇతర ఎంపీలు, అలాగే అధికార ఎన్డీయే నుంచి మంత్రులు మాట్లాడబోతున్నారు. అనంతరం ప్రధాని మోడీ సమాధానం ఇవ్వబోతున్నారు.

ఈ బిల్లుపై జరిగే చర్చలో కాంగ్రెస్ పాల్గొంటుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. లోక్సభలో 'పబ్లిక్ పరీక్షల (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు, 2026'పై చర్చకు మొత్తం 8 గంటల సమయం కేటాయించారు. అయితే, ప్రతిపక్షాల తుది వ్యూహం మాత్రం మంగళవారం ఉదయం పార్లమెంటులో జరిగే ప్రతిపక్ష సభాపక్ష నాయకుల సమావేశంలో ఖరారు కానుంది. అనంతరం ఈ బిల్లుపై లోక్ సభలో ముందుగా చర్చ ప్రారంభం కానుంది. లోక్ సభలో బిల్లు ఆమోదం తర్వాత ఎల్లుండి రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications