ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు: ఎన్నికల విధులకు దూరం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీని తక్షణమే బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని స్పష్టం చేసింది.
సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. గత కొంత కాలంగా విపక్ష రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.

ఇద్దరు డీఎస్పీలపై వేటు
ఇంతకుముందు ఎన్నికల సంఘం ఏపీలో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వారిపై అందిన ఫిర్యాదుల మేరకు ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది. అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
కాగా, మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు విస్తృత ప్రచారంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో కూటమిగా బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు తాము ఏం చేస్తామో చెబుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే, జూన్ 4న ప్రజల తీర్పు వెలువడనుంది. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో హోం ఓటింగ్ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications