అసలు కథ ఇదీ!: సేకరించింది 33వేలు, ప్రభుత్వానికి మిగిలేది 7,240 ఎకరాలే
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం రైతుల నుంచి 33 వేల ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తంలో చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలేది 7,240 ఎకరాలు మాత్రమే అంటూ వార్తలు వస్తున్నాయి. రైతుల నుంచి ప్రభుత్వం భూసేకరణ, భూసమీకరణ ద్వారా సేకరించిన భూమి వినియోగానికి సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
భూమినిచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చారని పేర్కొంది. దేశంలో ఇప్పటికే నిర్మించిన కొన్ని రాజధానులు గజిబిజిగా గందరగోళంగా ఉండటంతో ఆ పరిస్థితి అమరావతికి రాకూడదనే ఉద్దేశంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సి ఉందని ప్రభుత్వం వాదిస్తోంది.
రాజధాని అంటే కేవలం పెద్ద పెద్ద భవంతులే కాదని, విశాలమైన రహదారులు, పచ్చని పచ్చికబయళ్లు, ఆహ్లాదకరమైన వాతావరణంతో సామాజిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలవాలని అంటోంది. జీవకళలతో విలసిల్లే సజీవ నగరంగా ఉండాలనే ఆలోచనలో ఉంది.
సమాచార విప్లవం ద్వారా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా విద్య, వైద్య, ఆరోగ్య సంస్థలతోపాటు వైజ్ఞానిక కేంద్రాలకు నిలయంగా ఉండాలనేది ప్రభుత్వం వాదన. అమరావతి-ఆంధ్రుల కలల రాజధాని అంటూ ప్రభుత్వం దీనిని నిర్మిస్తుండటంతో కొత్త రాజధానిపై ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
వాటన్నింటిని ప్రతిబింబించే విధంగా ప్రపంచ స్థాయిలో అమరావతి నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుందని చంద్రబాబు పదే పదే ప్రజలకు వివరిస్తున్న సంగతి తెలిసిందే. తన ఆలోచనను రైతులు అర్థం చేసుకున్నారు కాబట్టే వారు స్వచ్ఛందంగా భూములు ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిలోనే కొంతభాగం విశాలమైన రహదారులతో కూడిన ప్లాట్లుగా ప్రభుత్వం రైతులకే ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
సుమారు 35 లక్షల మంది జీవించేలా అన్ని హంగులతో నగరం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రహదారులు, రైలుమార్గాలు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, గ్రీన్బెల్ట్ వంటి వాటితోపాటు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, క్రీడా ప్రాంగణాలు వంటి సామాజిక అవసరాలకు కొంత భూమి కేటాయించాల్సి ఉందన్నారు.
అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా రాజధానిలో ఆరు లైన్ల, నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాల్సి ఉంటుందని, ఇవన్నీపోగా ప్రభుత్వానికి సుమారు 7,240 ఎకరాలు మాత్రమే మిగులుతుందని ప్రభుత్వం చెబుతోంది. వీటిలోనే రాష్ట్ర పరిపాలనా భవనాలన్నీ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల భవనాలను కూడా ఇక్కడే నిర్మిస్తారు.
ఇదే ప్రాంతంలో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. సీడ్ క్యాపిటల్లో ప్రధానమైన స్టార్టప్ ప్రాంతం నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో టెండర్లు కూడా పిలిచిన సంగతి తెలిసిందే. ఇక సీఆర్డీఏ విడుదల చేసిన వివరాల ప్రకారం గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఉన్న మొత్తం రాజధాని ప్రాంత విస్తీర్ణం 8,603.32 చదరపు కిలోమీటర్లుగా ఉంది.
ఈ మొత్తంలో గుంటూరు జిల్లాలోని 26 మండలాలలో 3,787.97 చదరపు కిమీ ఉండగా, కృష్ణా జిల్లాలోని 30 మండలాలలో 4,815.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సెంట్రల్ ప్లానింగ్ ఏరియా 857 చదరపు కిమీ ఉంటుంది. ఈ పరిధిలోకి మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, ఇబ్రహీంపట్నం, విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, పెనమలూరు మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి.