ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం
చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై ఒక నిర్ణయం తీసుకుంది. హడ్కో (హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) నుంచి రుణం తీసుకొని నాలుగు నెలల్లో వీటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందివ్వబోతోంది. గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయకుండా వాటిని అలాగే వదిలేయడంతో మరమ్మతులకు భారీగా నగదు వ్యయం కాబోతోంది. దీనిపై అధికారులు అంచనాలను రూపొందిస్తున్నారు.
నిర్మాణ వ్యయానికి నగదు
ఇళ్ళు ఏయే దశల్లో ఉన్నాయి? ఎన్ని పూర్తయ్యాయి? మొత్తం పూర్తిచేసేందుకు ఎంత ఖర్చవుతుంది? తదితర వివరాలను నివేదిక రూపంలో అందించాలంటూ హడ్కో అధికారులు ప్రభుత్వానికి సూచించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్ల వరకు రుణం తీసుకొని చివరి దశలో ఉన్నవాటిని పూర్తిచేయాలని భావించింది. అయితే హడ్కో ప్రతినిధులు మొత్తం నిర్మాణ వ్యయానికి అవసరమైన నగదును అందజేస్తామని చెప్పడంతో ఆ మేరకు నివేదికలు రూపొందిస్తున్నారు.

మొత్తం రుణం ఇస్తామన్న హడ్కో
2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చి 52వేల ఇళ్లను రద్దు చేసింది. రెండున్నర లక్షల ఇళ్లను పూర్తిచేస్తామని చెప్పి ఎన్నికల సమయానికి లక్షన్నర ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ప్రస్తుతానికి 1.17 లక్షల ఇళ్లను పూర్తిచేయాల్సి ఉండటంతో రూ.5.7వేల కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
రానున్న రెండురోజుల్లో పూర్తిస్థాయిలో నివేదికలను రూపొందించి హడ్కో ప్రతినిధులకు అందజేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దెబ్బతిన్న ఏపీ పరపతి చంద్రబాబు అధికారంలోకి రావడంతో నెమ్మదిగా పెరుగుతోంది. దీనికి నిదర్శనమే హడ్కో మొత్తం రుణం అందజేస్తామని చెప్పడం అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications