ఏపీలో చిట్ ఫండ్ కంపెనీలకు షాకిచ్చిన ప్రభుత్వం!
చిట్ ఫండ్ సంస్థల విషయంలో ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకనుంచి చిట్స్ నిర్వహణ అంతా ఆన్ లైన్ లో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. దీనికోసం ఈచిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ను రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఏపీ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. రాష్ట్రంలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా ఉండాలనే యోచనతో ఈ చర్యలు తీసుకున్నట్లు ధర్మాన తెలిపారు.
చందాదారులు ఈ- చిట్స్ ద్వారా తమ డబ్బు సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవచ్చని, చిట్లు వేసే చందాదారులు మోసపోకుండా ఉండాలనే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త విధానం ప్రకారం ఇకనుంచి అన్ని చిట్ ఫండ్ కంపెనీలు ఆన్ లైన్ ద్వారానే లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో నమోదైన సంస్థలు ఈ విధానంలోకి కచ్చితంగా రావాల్సిందేనన్నారు.

అంతకుముందు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలవుతున్నా కొన్ని సామాజికవర్గాలు ఇంకా వెనకబడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వమే అన్ని వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, చట్టసభల్లో కూడా అందరికీ ప్రాతినిధ్యం కల్పించిందన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో కుట్ర జరుగుతోందని, బటన్ నొక్కి పథకాలందిస్తున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, ఇప్పటికీ అక్షరాస్యత లేనివారు 21 శాతంగా ఉన్నారని, ఇటువంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతోందన్నారు. పాలనలో లోపం ఉండటంవల్ల ఇలా జరుగుతోందని, ఆ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారన్నారు. ఇప్పుడు జగన్ చేస్తున్న ప్రయత్నం 50 సంవత్సరాల క్రిందటే చేసివుంటే ఏపీ ఇంకోరకంగా ఉండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications