ఉచిత బస్సు ప్రయాణంతోపాటు మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) ప్రభుత్వం పరిపాలనను పరుగులు తీయిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యమని చెబుతూ దీంతోపాటు సమానంగా సంక్షేమాన్ని కూడా అమలు చేస్తామంటున్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15వ తేదీన ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు.
రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. కనిష్టంగా రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాన్ని అందివ్వనున్నారు. దీన్ని వాయిదాల రూపంలో చెల్లించిన తర్వాత మరో కొత్త రుణాన్ని ఇస్తారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు రూ.250 కోట్ల రుణం ఇవ్వాలనే లక్ష్యాన్ని అధికారులకు సీఎం నిర్దేశించారు. దీనికి సంబంధించిన పత్రాలపై సెర్ప్ వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు.

యూనిట్లపై ప్రభుత్వ పర్యవేక్షణ
రుణం తీసుకున్నవారు నెలరోజుల్లోగా యూనిట్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. ఎటువంటి జీవనోపాధినైనా డ్వాక్రా మహిళలు ఎంపిక చేసుకోవచ్చు. మేనిఫెస్టోల చెప్పిన విధంగా సీఎం చంద్రబాబు అన్నింటినీ అమలు చేస్తున్నారని, తమ పాలన సామాన్యులకు మేలు చేసేదిలా ఉంటుందని మంత్రి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని పథకాలను పేర్లు మారుస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. పింఛన్ల పంపిణీని సవాల్ గా తీసుకొని విజయవంతంగా పూర్తి చేశామని, వచ్చే నెలలోను ఇలాగే పింఛన్లు అందజేస్తామన్నారు.












Click it and Unblock the Notifications