మద్యం ఆదాయానికి ఏపీ ప్రభుత్వం కొత్త వ్యూహం - పెరగనున్న మార్జిన్ : వ్యాట్ సవరణ వెనుక..!!
ఆర్దిక కష్టాల నుంచి గట్టెక్కటం కోసం ప్రభుత్వం కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఆదాయం పెంపు దిశగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ (ఏపీఎస్బీసీఎల్) కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా ప్రభుత్వం తాజాగా మద్యం అమ్మకాల పైన పన్ను సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సవరణల ద్వారా రిటైల్ అమ్మకాల్లో ఎటువంటి ధరల తేడా ఉండదని స్పష్టం చేసింది. మద్యంపై ఇప్పటివరకూ విధిస్తున్న వ్యాట్ను గణనీయంగా తగ్గించి.. ఆ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు కొత్తగా ప్రత్యేక మార్జిన్ను ప్రవేశపెట్టింది.

రిటైల్ అమ్మకాల్లో మార్పు ఉండదు
ఫలితంగా వినియోగదారుడికి విక్రయించే ఎమ్మార్పీ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోయినప్పటికీ ఏపీఎస్బీసీఎల్కు లభించే మార్జిన్ మాత్రం భారీగా పెరగనుంది. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పస్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా బేవరేజెస్ కార్పోరేషన్ కు ఇప్పటి వరకూ వ్యాట్ రూపంలో వస్తున్న దాంట్లో కొంత మొత్తాన్ని ఇకపై చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలా మిగిలిన మొత్తం ఆదాయం అవుతుంది. ఈ మేరకు కార్పొరేషన్కు లభించే మార్జిన్ పెరుగుతుంది. మద్యం ఆదాయాన్ని హామీగా చూపించి ఏపీఎస్బీసీఎల్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం రూ.వేల కోట్లు రుణాలుగా తీసుకుంది.

సంస్థకు ఆదాయం కోసం కొత్త మార్గం
ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు ఎక్కువ ఆదాయం లభించేలా చేసేందుకు వీలుగా ఈ సవరణలు చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటివరకూ మద్యంపై స్పెషల్ మార్జిన్ రేటు లేదు. వివిధ కేటగిరీల మద్యంపై 85 శాతం నుంచి 130 శాతం వరకూ స్పెషల్ మార్జిన్ రేటును కొత్తగా విధించారు. సాధారణంగా వ్యాట్ తగ్గిస్తే ఆ మేరకు పన్నుల భారం తగ్గి వినియోగదారుడి నుంచి వసూలు చేసే ఎమ్మార్పీ ధర కూడా తగ్గాలి. అయితే ప్రభుత్వం మాత్రం పన్నులను తగ్గించి.. ఎమ్మార్పీలో తేడా లేకుండా ఉండేందుకు వీలుగా ఆ వ్యత్యాసాన్ని ప్రత్యేక మార్జిన్ రేటు రూపంలో వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.

వ్యాట్ వసూలులో సవరణలు
వివిధ కేటగిరీల మద్యంపై ప్రస్తుతం 130 శాతం నుంచి 190 శాతం వరకూ వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఆయా కేటగిరీలపై 35 శాతం నుంచి 60 శాతం వరకూ తగ్గించారు. వ్యాట్ తగ్గించటం వల్ల ఏపీఎస్బీసీఎల్ వివిధ కేటగిరీల మద్యంపై ఇప్పటివరకూ చెల్లిస్తున్న మొత్తంలో 95 శాతం నుంచి 130 శాతం వరకూ తగ్గింది. ఆ మొత్తాన్ని స్పెషల్ మార్జిన్ రేటు రూపంలో కొర్పొరేషన్ పొందనుంది. ఈ లెక్కన అంత శాతం మేర మార్జిన్ దీనికి లభించనుంది. ద్యం విక్రయాల వల్ల ఏపీఎస్బీసీఎల్కు 10 శాతం మార్జిన్ ఉంటుంది.

పెరగనున్న మార్జిన్...ఆదాయం
అందులో 6 శాతం నిర్వహణ ఖర్చులకు పోగా, మిగతా 4 శాతం ఆ సంస్థకు లాభం. ఉదాహరణకు వంద రూపాయిల విలువైన మద్యం అమ్మితే కార్పొరేషన్కు రూ.10 మిగిలేది. మిగతాది సొమ్ము మద్యం తయారీదారులతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో వెళ్లేది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.20,189 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. అందులో 10 శాతం అంటే గతంలో ఏపీఎస్బీసీఎల్కు రూ.2 వేల కోట్ల మేర మాత్రమే మార్జిన్ ఉండేది. అందులోనే నిర్వహణ ఖర్చులూ అన్నీ ఉండేవి. తాజా మార్పుల వల్ల ఇకపై 95 శాతానికి పైగా మార్జిన్ ఉండటం వల్ల ఆ మేరకు విక్రయ విలువలో సింహభాగం ఆదాయం ఏపీఎస్బీసీఎల్కే సమకూరనుంది.
Recommended Video

నేరుగా ఏపీబీసీఎల్ రాబడి పెరిగేలా
ఇప్పటి వరకు స్పెషల్ మార్జిన్ కింద మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 0.5 శాతం మాత్రమే బేవరేజెస్ కార్పొరేషన్కి దక్కేది. అంటే... 2020-21లో రూ.60 కోట్లు స్పెషల్ మార్జిన్ కింద అందాయి. ఇప్పుడు ఈ రెండు జీవోలతో స్పెషల్ మార్జిన్ రూ.60 కోట్ల నుంచి ఏకంగా రూ.6,000 కోట్లకు పెరిగింది. నిబంధనల ప్రకారం... స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి. ట్యాక్స్, డ్యూటీ, సెస్, ఫీజు... పేరు ఏదైనా ప్రజల నుంచి వసూలయ్యే డబ్బు రాష్ట్ర ఖజానాకు రావాల్సిందే. కానీ, ఖజానాకు రాకుండా నేరుగా కార్పొరేషన్లోనే ఉండేందుకే ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ అనే పేరు జీవోలో వాడింది. ఈ వాదనలో న్యాయ పరమైన ఇబ్బందులు సైతం ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications