మామిడి రైతుల వ్యధ:మాగిపోతున్న మామిడి...వద్దంటున్న పల్ప్ ఫ్యాక్టరీలు
చిత్తూరు:జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యింది. పంటను కోసి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర దక్కని స్థితి...కోయకుండా వదిలేద్దామంటే పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి.
మామిడి రైతులను ఏడాది అంతటా వెంటాడిన ఈ సందిగ్ధం ఇప్పుడు పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవడంతో ఏదో ఒక నష్టానికి సంసిద్ద మవ్వాల్సిన స్థితికి నెట్టేసింది. కారణం...కోసిన పంటే పల్ప్ ఫ్యాక్టరీల నిరాకరణ కారణంగా మగ్గిపోయి కుళ్లుడుబారిన పడుతుంటే...మరో 90 వేల టన్నుల పంట చెట్ల మీదే ఉన్న పరిస్థితి మామిడి రైతును భీతిల్లచేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గురించి పట్టించుకోకుంటే ఆత్మహత్యలు తప్పవని రైతులు వాపోతున్నారు.
మామిడి సాగుకి...మొగ్గు చూపారు
చిత్తూరు జిల్లాలోని రైతులు మామిడి వైపు మొగ్గు చూపారు. ఈ పంట బాగా వస్తే గిట్టుబాటు ధర వస్తుందని ఎంతో ఆశపడ్డారు. జిల్లావ్యాప్తంగా 96వేల హెక్టార్లలో మామిడి సాగవుతోంది. తోతాపురి అత్యధికంగా 53శాతం, బేనీషా 25శాతం, నీలమ, మల్లిక, సింధూరా, కాలేపాడు, రుమాని రకాలు 22 శాతం పంట వేశారు. గతేడాదికన్నా ఈ ఏడాది సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనా దిగుబడి, నాణ్యత బాగా ఉందని రైతులు ఆనందపడ్డారు. అయితే ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటే అయింది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా చివరకు రైతుకు నిరాశే మిగిలే స్థితి కనిపిస్తోంది. కారణం ఈ ఏడాది మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడమే. దీంతో మామిడి రైతులు రోడ్డెక్కారు.
పల్ప్ ఫ్యాక్టరీలు...చేతులెత్తేశాయి...
ప్రభుత్వం కిలో తోతాపురి రకానికి మద్దతు ధర రూ.7.50 ప్రకటించింది. దీంతో గ్రామస్థాయి అధికారులు జారీ చేసే పర్మిట్లతో రైతులు గుజ్జు పరిశ్రమలకు మామిడిని తరలిస్తున్నారు. అయితే జిల్లాలో 56 గుజ్జు పరిశ్రమలు ప్రైవేట్వి ఉన్నా, వాటిలో కేవలం సగం మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ పరిశ్రమలు సైతం రోజుకు 6-7 టన్నుల మామిడిని మాత్రమే ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. దీంతో కాయలు కొనుగోలు చేయలేమని కొన్ని పల్ఫ్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు బోర్డులు పెట్టేస్తున్నాయి. మరికొన్ని ఫ్యాక్టరీలు అధికార పార్టీ నేతలు సిఫార్సు చేసిన రైతుల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేస్తూ...సామాన్య రైతులను రోడ్ల మీదే ఉంచేస్తున్నారని...దీంతో వాహనాల్లోనే పండ్లు కుళ్లిపోతున్నాయని...దీంతో అవి పనికిరావని తిప్పి పంపేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ...సహకారం లేదు...
జిల్లాలోని బంగారుపాళ్యం, తవణంపల్లి, ఐరాల, పూతలపట్టు, పులిచెర్ల, సదుం, సోమల మండలాల్లో ఎక్కువగానూ, మిగిలిన మండలాల్లో తక్కువగానూ తోటల్లోనే మామిడికాయలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. దాదాపు 90 వేల టన్నుల పంట చెట్లలోనే మాగిపోతోందని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో గుజ్జు పరిశ్రమలు ఈ మామిడిని కొనుగోలుచేస్తేనే మామిడి రైతుకు కొంతైనా ఊరట లభించే పరిస్థితి. పరిశ్రమల శాఖ మంత్రి ఇదే జిల్లాలో ఉన్నా ఒక్క పల్ప్ ఫ్యాక్టరీ కూడా ప్రభుత్వం తరపున లేకపోవడం గమనార్హం. మామిడి పంటను వేసుకోవాలని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం మార్కెటింగ్ చూపించకపోవడం రైతులకు శరాఘాతంగా మారింది.
సిండికేట్ కళకళా...రైతు విలవిల
ప్రభుత్వ పల్ప్ పరిశ్రమలు లేకపోవడంతో ప్రయివేట్ ఫ్యాక్టరీలు సిండికేట్గా ధరను శాసిస్తున్నాయి. నిజానికి ఇక్కడ ఇప్పుడు కేజీ మామిడిపండ్లను రెండు రూపాయలకూ కొనే పరిస్థితి లేదు. సహజం గానే కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంలో ఉండడంతో దోపిడీకి హద్దూ లేకుండా పోతోంది. ఫ్యాక్టరీల కొనుగోళ్లపై ఒక రైతు ఆవేదన ఇది..."నేను ఈనెల 13 వ తేదీన పర్మిట్ తీసుకుని ఫ్యాక్టరీ వద్దకు మామిడి కాయలు తీసుకొచ్చాను. వాహనాన్ని పరిశీలించి 15వ తేదీన మామిడి కాయల అన్లోడింగ్కు రమ్మన్నారు. అయితే 17వ తేదీ వచ్చినా ఇంకా రెండు రోజులు అనంతరమే అన్లోడింగ్ చేస్తామంటున్నారు. ఇలా మరో రెండు రోజులు ఉంటే కాయలు పూర్తిగా పండుగా మారిపోతాయి. దీన్ని ఫ్యాక్టరీ వారు తీసుకోవడం లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు"...ప్రభుత్వం జోక్యం చేసుకొని న్యాయం చేయకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బోరుమంటున్నారు మామిడి రైతులు.