కేంద్ర సర్వీస్కు వెళుతున్న ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ
అమరావతి: ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న ఆయన్నుకేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో జాయింట్ డిప్యూటీ డైరెక్టర్గా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆకే రవికృష్ణ గతంలో గుంటూరు అర్బన్, కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. కర్నూలు జిల్లా ఎస్పీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయనను కొన్ని నెలల క్రితమే టీటీడీ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా బదిలీ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్న కాలంలో అనాధలకు ఆశ్రయం, హిజ్రాలకు అండదండలు, పేకాటరాయుళ్ల కు విన్నపం వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలతో సామాజిక పరివర్తనకు విశేష కృషి చేశారు.
Recommended Video
అనంతరం కర్నూలు ఎస్పీగా బదిలీ అయిన అనంతరం అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. కర్నూలు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ జిల్లాలో ఫ్యాక్షన్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించి వినూత్న పద్దతుల్లో చాలా వరకు ఫ్యాక్షన్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలిగారు. ఫ్యాక్షన్ గ్రామాల్లోకి ఒంటరిగా వెళ్లి ఫ్యాక్షన్ కు బలైన కటుంబాలను కలిసి వారిలో చైతన్యాన్ని నింపడం, వారికోసం స్పెషల్ ఆల్బమ్ లు రూపొందించడం వంటి కార్యక్రమాలు ఎస్పీ ఆకే రవికృష్ణకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.