6దశాబ్దాల తర్వాత సొంతగడ్డపై నూతన అధ్యాయం: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. సొంత గడ్డ నుంచి తొలి శాసనసభ పర్వానికి నేడు శుభారంభం పలుకుతున్నారు. ఆరు దశాబ్దాల తరవాత ఆంధ్రప్రదేశ్ నేలపై శాసనాలు లిఖించే ఘట్టానికి శ్రీకారం చుడుత
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త అధ్యాయం మొదలవుతోంది. సొంత గడ్డ నుంచి తొలి శాసనసభ పర్వానికి నేడు శుభారంభం పలుకుతున్నారు. ఆరు దశాబ్దాల తరవాత ఆంధ్రప్రదేశ్ నేలపై శాసనాలు లిఖించే ఘట్టానికి శ్రీకారం చుడుతున్నారు. వెలగపూడిలో నిర్మించిన శాసనసభ ప్రాంగణంలో సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి.
సభలో చర్చించేందుకు అవసరమైన అంశాలను అధికార, విపక్షాలు సిద్ధం చేసుకున్నాయి. 11గం.06నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జరిగే సభా వ్యవహారాల సంఘం సమావేశంలో ఎన్ని రోజులపాటు సభను నిర్వహించాలనే అంశాన్ని చర్చిస్తారు. మార్చి 13న సాధారణ, వ్యవసాయ బడ్జెట్లను ప్రవేశపెడతారు.
కాగా, ఆరు నెలల తరువాత రాష్ట్ర శాసనసభ సమావేశమవుతోంది. గత సెప్టెంబరులో వర్షాకాల సమావేశాల తరవాత సభ జరగలేదు. ఆంధ్రప్రదేశ్ నేలపై నుంచే సభా కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు. సభ భవనాన్ని నిర్మిస్తుండటంతో సంప్రదాయంగా నిర్వహించే శీతాకాల సమావేశాలు కూడా జరపలేదు.
కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించే దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 21మంది తమ పక్ష ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా ప్రస్తావించాలని వైసీపీ భావిస్తోంది. అంతేగాక, వైసీపీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించడంపై ఏడో తేదీన నిర్ణయం తీసుకోనున్నారు. ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఆ సమయం పూర్తయింది. టీడీపీ ఎమ్మెల్యే వి అనితపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశంపై సభాహక్కుల సంఘం నిర్ణయం సభ ముందుకు రానుంది.
ఎన్టీఆర్కు బాబు, వైయస్కు జగన్ నివాళి
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబునాయుడుతోపాలు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. వైయస్సార్ విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలతో నివాళులర్పించారు.