ఉద్యోగులకు శుభవార్త: 'ఏపీ స్థానికత'కు కేంద్రం గ్రీన్సిగ్నల్
హైదరాబాద్: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలి వెళ్లే ఉద్యోగులతో పాటు వారి పిల్లలకు స్థానికత కల్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఫైలును న్యాయశాఖ పరిశీలనకు పంపింది.
న్యాయశాఖ ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయకపోతే వీలైనంత త్వరలో స్థానిక హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలవడతాయని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ న్యాయ శాఖ పరిశీలన అనంతరం మళ్లీ పైలును కేంద్ర హోంశాఖకు చేరుతుందన్నారు.
ఆ తర్వాత కేంద్ర హోంశాఖ రాష్ట్రపతి ఆమోదానికి పంపించనుందని తెలిపారు. రాష్ట్ర విభజన తేదీ జూన్ 2, 2014 నుంచి మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్కు వెళ్లే కుటుంబాలందరికీ స్థానికత కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 7న కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది ముసాయిదా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్రం అడిగిన పలు వివరణలు ఇవ్వడంతో పాటు, రాష్ట్రపతి ఉత్తర్వులకు కొన్ని సవరణలు కూడా సూచించింది. ఈ సవరణలు ద్వారా ఉమ్మడి ఏపీలోని ఎక్కడి నుంచైనా ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతానికి వలస వెళ్లినప్పటికీ స్థానికత వర్తిస్తుంది.