పవన్ కల్యాణ్ ఎంట్రీ: ఎపిలో నాలుగు స్తంభాలాటనా, ముక్కోణమా?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశంతో వాతావరణం వేడెక్కింది. నవంబర్లోగా నగరపాలక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పార్టీల మధ్య పోరు అక్కడి నుంచే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి మధ్య ముఖాముఖి పోరు జరుగుతుందనే అభిప్రాయం ఇప్పటి వరకూ ఉంటూ వచ్చింది. కానీ, అది బహుముఖ పోటీకి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీతో బిజెపి స్నేహం కొనసాగుతుందా లేదా అనే సందిగ్దత నెలకొన్న స్థితిలో ఆ పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. మున్సిపల్ ఎన్నికల నాటికి కాకపోయినా 2109 ఎన్నికల నాటికి అదే పరిస్థితి రావచ్చునని అంటున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ తన పార్టీని ఒంటరిగా పోటీకి దించుతారనే ప్రచారం సాగుతోంది.

చంద్రబాబు నాయుడు ఇలా...
ప్రత్యేక హోదాపై తాను కార్నర్ కాకుండా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. బిజెపిని ఇరకాటంలో పెట్టి, తాను బయటపడాలని చూస్తున్నారు. వ్యూహాత్మకంగా కేంద్రం ఇచ్చింది తీసుకుంటామని చెబుతూనే ప్రత్యేక హోదాపై పోరాటానికి దిగుతున్న పవన్ కల్యాణ్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానిస్తున్నామనే చెబుతూనే ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేయలేదని చెబుతున్నారు. ఆ రకంగా ఆయన బిజెపిని కార్నర్ చేయడానికి పూనుకున్నారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇలా...
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే మరెప్పుడూ రాలేమనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం సాగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆయన చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబును పూర్తిగా దెబ్బ తీస్తే తాను అధికారంలోకి రావడానికి మార్గం ఏర్పడుతుందని ఆయన అనుకుంటున్నారు. ఆయన బిజెపితోనైనా, కాంగ్రెసుతోనైనా కలిసి పనిచేసే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.

పవన్ కల్యాణ్ ఏం చేస్తారో....
జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో దుమ్ము రేపాలని చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులను పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆయన ఆంతరంగం ఏమిటనేది తెలియడం లేదు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు విఫలమైతే తాను రంగంలోకి దిగుతానని చెబుతున్నారు. అంటే, వచ్చే ఎన్నికల సమయంలో ప్రస్తుత పార్టీలన్నీ విఫలమయ్యాయని ఆయన ఎన్నికల రంగంలోకి దిగుతారా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఆయన కొంత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నట్ల కనిపిస్తున్నారు. మోడీని గానీ చంద్రబాబును గానీ ఆయన ఏమీ అనడం లేదు. పార్లమెంటు సభ్యులను మాత్రమే టార్గెట్ చేశారు. బిజెపిని టార్గెట్ చేశారు. ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. సిపిఐ, సిపిఎం నాయకులు పవన్ కల్యాణ్ వెంట నడిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు..

బిజెపి భవిష్యత్తు ఏమిటి..
రాష్ట్రంలో బిజెపికి భవిష్యత్తు లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. అయితే, ఆ పార్టీ కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ వంటి బడా నాయకులున్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో సత్తా చాటడానికే ప్రయత్నించవచ్చు. ప్రత్యేక హోదా వల్ల తలెత్తిన వ్యతిరేకతను వారు చల్లార్చడానికి ప్రయత్నించవచ్చు. రాష్ట్ర నాయకులు చాలా మంది తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. స్వతంత్రంగా పోటీ చేస్తే ఎపిలో సత్తా చాటవచ్చునని వారు అంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

కాంగ్రెసు ఏమవుతుందో....
కాంగ్రెసు పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఏ మాత్రం మెరుగుపడడం లేదు. తాము పుంజుకుందామని అనుకుంటున్న సమయంలోనే పవన్ కల్యాణో, జగనో దాన్ని కొట్టుకుపోతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్కు కాంగ్రెసు పార్టీ మద్దతు ఇస్తుందా అనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications