లక్ష ఎకరాలు లాక్కున్నామని నిరూపిస్తే రాజీనామా చేస్తా: కొల్లు
విజయవాడ: ప్రభుత్వం లక్ష ఎకరాలను అక్రమంగా లాక్కుందనే ఆరోపణలు రావడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. బందరుపోర్టు నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అంతేగాక, మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(మడ) ఆధ్వర్యంలో ప్రభుత్వం లక్ష ఎకరాలు లాక్కొంటుందని నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగునని మంత్రి కొల్లు రవీంద్ర తేల్చిచెప్పారు.
విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ బందరు అభివృద్ధికి ఉపయోగపడే సంస్థ అన్నారు. దీని పరిధిలోకి మొత్తం లక్షా ఐదు వేల ఎకరాలు వస్తుందన్నారు. ఇందులో బందరు పట్టణంతో పాటు బందరు పోర్టు ఇతర పరిశ్రమల అభివృద్ధికి సమీకరిస్తున్న ప్రాంతం కూడా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. మడ పరిధిలోకి లక్షా ఐదు వేల ఎకరాలు వస్తుందని, అయితే ఇందులో బందరుపోర్టుతో పాటు ఇతర పరిశ్రమల అభివృద్ధికి 33వేల ఎకరాలను ప్రభుత్వం సమీకరిస్తుందని తెలిపారు. ఆ 33 వేల ఎకరాల్లో కూడా 21వేల ఎకరాలలో ప్రభుత్వ, ఎస్సైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయని మంత్రి వివరించారు. ఇక 14 వేల ఎకరాల రైతులకు చెందిన భూమిని ప్రభుత్వం సమీకరణ ద్వారా తీసుకుంటుందని వివరించారు.
మడ పరిధిలో లక్షా ఐదువేల ఎకరాలు వచ్చినప్పటికీ రైతుల భూములను సమీకరించేది కేవలం 14వేల ఎకరాలే ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అలా అని రైతుల నుంచి భూమి తీసుకోవటం లేదని వారిని భాగస్వాములను చేస్తుందన్నారు. అమరావతి నగరంలో ఎలాంటి నిబంధనలు అయితే అమలు జరుగుతున్నాయో అలాంటి నిబంధనలే మచిలీపట్నం డెవలప్మెంట్ అధారిటీలో కూడా అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
అంతేగాక, భూములు తీసుకున్న రైతులకు మామూలు ప్రాంతంలో వెయ్యి గజాలు, కమర్షియల్ ఏరియాలో 250గజాల స్థలం కేటాయిస్తామని తెలిపారు. డెవలప్ చేసిన ప్రాంతాన్ని రైతులకు ఇస్తే అమరావతిలో ఎలాంటి మేలు జరిగిందో బందరు రైతులకు కూడా అదే మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు. అదే విధంగా కూలీలకు పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
స్కిల్ డవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మడలో చేపట్టే ప్రతీ పని స్థానిక రైతులకు, ప్రజలకు మేలు చేస్తుందని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు మడపై లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అవినీతి కుంభకోణాల్లో ఉన్న వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేదని మంత్రి అన్నారు.
దాదాపు రూ.48వేల కోట్ల ఆస్తులను ప్రభుత్వం అటాచ్ చేసిందని అలాంటి నిందితుడు ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ అండ్ టీం చేస్తోందని మంత్రి ఆరోపించారు. మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రగల్బాలు పలికిన పేర్ని నాని ఇలాంటి పనుల చేయటం సరికాదన్నారు.
మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బందరు ప్రాంతానికి అన్యాయం చేసిందన్నారు. వైయస్ రాజశేఖర్రెడ్డి బందరు ప్రజలకు అన్యాయం చేయాలని తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి మండిపడ్డారు. గోగులేరుకు పోర్టును తరలించిన రాజశేఖర్రెడ్డి.. బందరు ప్రజల ఉద్యమాలకు దిగివచ్చిన సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోయారని మంత్రి గుర్తు చేశారు.
ఆ పార్టీ నాయకులు ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులతో కలిసి ప్రజలను రెచ్చగొట్టటం సరికాదన్నారు. బందరు ప్రజలకు మేలు చేయాలంటే పోర్టు నిర్మాణం జరగాలన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మొత్తం 4వేల 8వందల ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేసి తీరతామని మంత్రి అన్నారు. బందరు పోర్టుకు షిప్ను తీసుకురాగలిగేది తెలుగుదేశం ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసిన ప్రాంతాలు త్వరగా అభివృద్ధి చెందుతాయని మంత్రి వివరించారు. అదే దృక్పథంతో మచిలీపట్నం ఏరియాలో మంచిరోడ్లుతో పాటు పరిశ్రమలను కూడా నెలకొల్పుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భూసమీకరణ జరిగిన తరువాత రైతులకు అమరావతిలో భూమిలో వాటా ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇస్తామని మంత్రి ప్రకటించారు.
అయితే
భూములు
ఇచ్చే
వారికి
ఎలాంటి
నష్టం
ఉండదని
మంత్రి
భరోసా
ఇచ్చారు.
రైతులకు,
ప్రజలకు
మేలు
చేసేలా
నిబంధనలు
తయారవుతున్నాయని
మంత్రి
హామీ
ఇచ్చారు.
ఇకనైనా
ప్రతిపక్ష
పార్టీ
నాయకులు
నిజాలు
తెలుసుకుని
బందరు
ప్రజల
మేలును
అడ్డుకోవద్దన్నారు.
సాధ్యమైనంత
తొందరంగానే
బందరు
పోర్టుతో
పాటు
మడలో
అభివృద్ధి
పనులు
కూడా
మొదలవుతాయని
మంత్రి
తెలిపారు.