జగన్ది విషప్రచారం: దేవినేని, జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఇబ్బందే: యనమల
అమరావతి: పోలవరం లెప్ట్ కెనాల్ పనులను త్వరగా ప్రారంభించిన 2018 నాటికి నీరు అందిస్తామని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. బుధవారం విశాఖలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టిసీమ స్ఫూర్తితో పోలవరం లెఫ్ట్కెనాల్ను ఛాలెంజ్గా తీసుకున్నామన్నారు.
ఏపీలోని నీటి ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత వైయస్ జగన్ విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో పంటలకు సాగు నీరందక ఎండిపోతున్నాయని, మరోపక్క గోదావరి నీటిని తరలిస్తున్నారని, అలాగే రాయలసీమకు నీళ్లివ్వడం లేదంటూ ప్రజలను జగన్ రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇకనైనా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ద్వంద వైఖరిని విడాలాని మంత్రి సూచించారు. పులిచింతల ప్రాజెక్టుపై వైయస్ జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన మాజీ మంత్రి బొత్స తోటపల్లిని ఎందుకు పూర్తిచేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కాంగ్రెస్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమని ధ్వజమెత్తారు.
జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు ఆర్థికంగా కొంత ఇబ్బందే: ఆర్ధిక మంత్రి యనమల
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వల్ల రాష్ర్టాలకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, పాలనాపరంగా తీసుకునే మార్పులకు సిద్ధంగా ఉండాలని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం విశాఖపట్నంలోని అంకోసాహాలులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన వ్యాపారులు, ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలులోకి రానున్నదని పేర్కొన్నారు. త్వరలోనే రాజ్యసభలో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందన్నారు.
దీంతో పన్ను ఎగవేతకు ఆస్కారం ఉండదన్నారు. కొత్త రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నాయని ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రతి పైసా చెల్లించాలని వ్యాపారులను ఆయన కోరారు. అంతేకాదు ఏపీలో ఉన్న ఇబ్బందులను సాకుగా చూపి కొత్తగా పన్నులు వేయబోమని స్పష్టం చేశారు.
రేషన్ దుకాణాల్లో పెరిగిన కందిపప్పు ధర
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ దుకాణాల్లో విక్రయించే కందిపప్పు ధర కిలో రూ. 50 నుంచి 90కి పెరిగింది. కందిపప్పు ధర బయట భారీగా పెరుగుతుండటంతో రేషన్ దుకాణాల ద్వారా విక్రయించే కందిపప్పుపై ఇచ్చే రాయితీ ప్రభుత్వానికి అధిక భారంగా మారుతోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కందిపప్పు దొరకడం లేదనీ, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తోందని అందుకే ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
.