భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు. కొత్త ధరలు ఇవే!
గత కొన్ని రోజులుగా అందరూ అనుకుంటున్నట్లు ఐదురాష్ట్రాల ఎన్నికల అనంతరం ఏ క్షణమైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు అనే విషయాన్ని చమురు సంస్థలు తేల్చేశాయి. దేశవ్యాప్త వాహనదారులకు ఇవాళ ఉదయం చేదు వార్తతో మొదలైంది. గత నాలుగేళ్లుగా స్థిరంగా ఉంటూ వస్తున్న ఇంధన ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఈ రోజు తెల్లవారుజాము నుంచే సామాన్యుడి నెత్తిన చమురు కంపెనీలు భారీ పిడుగు వేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.
లీటరుకు రూ.3 పెంపు!
దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటరుకు సగటున రూ.3, డీజిల్ లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. పెరిగిన ఈ ధరలు ఈరోజు (శుక్రవారం, మే 15) ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులు బంకుల వద్దకు వెళ్లేసరికి కొత్త ధరలు దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, గత కొంతకాలంగా రిటైల్ ధరలను మార్చకపోవడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలపై కలిపి నెలకు దాదాపు రూ.30,000 కోట్ల మేర రికవరీ లోపం (Under-recovery) ఏర్పడుతోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల నెలకు రూ.14,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నా, ఓఎంసీల ఆర్థిక స్థితి దారుణంగా దెబ్బతినకుండా ఉండేందుకే ఈ ధరల పెంపు అనివార్యమైందని ప్రభుత్వం పేర్కొంది.

ధరల పెంపునకు ప్రధాన కారణాలు:
- ముడి చమురు సెగ: అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 110 డాలర్ల మార్కును దాటడం.
- యుద్ధ ప్రభావం: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల సరఫరా గొలుసు దెబ్బతినడం.
- కంపెనీల నష్టాలు: గత కొన్ని వారాలుగా ధరలు పెంచకపోవడం వల్ల చమురు కంపెనీలు రోజుకు రూ.1,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకే ఈ భారం వేసినట్లు తెలుస్తోంది.
నగరాల వారీగా పెట్రోల్ ధరల వివరాలు:
- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్పై రూ. 3.00 పెరగడంతో కొత్త ధర రూ. 97.77కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 3.10 పెరిగి రూ. 106.64 వద్ద విక్రయించబడుతోంది.
- కోల్కతాలో రూ. 3.29 పెంపుతో రూ. 108.74కు,
- చెన్నైలో రూ. 3.10 పెంపుతో రూ. 103.90కు ధరలు చేరాయి.
- హైదరాబాద్లో అత్యధికంగా రూ. 3.39 పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ. 110.89కి చేరి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.64 గా నమోదై.. దేశంలోనే టాప్ లో ఉంది
- బెంగళూరులో రూ. 106.17, తిరువనంతపురంలో రూ. 110.75గా కొత్త ధరలు నమోదయ్యాయి.
డీజిల్ ధరల పెంపు ఇలా:
డీజిల్ ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు డీజిల్ రూ. 90.67 (+రూ. 3.00) కాగా, హైదరాబాద్లో రూ. 3.26 పెరిగి రూ. 98.96 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో రూ.100.34 గా ఉండగా.. దేేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రూ. 93.14, కోల్కతాలో రూ. 95.13, చెన్నైలో రూ. 95.47గా ధరలు ఉన్నాయి. అత్యధికంగా తిరువనంతపురంలో డీజిల్ ధర రూ. 99.63కు చేరువయ్యింది. స్థానిక వ్యాట్ (VAT), డీలర్ కమిషన్ల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రధాని పిలుపు.. ఆ వెంటనే బాదుడు!
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు పౌరులందరూ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోడీ గత ఆదివారమే పిలుపునిచ్చారు. మెట్రో సేవలు, ఈవీలు, కార్పూలింగ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఆయన సూచించారు. ప్రధాని ఈ విజ్ఞప్తి చేసిన కొద్ది రోజులకే ఇంధన ధరలను పెంచడం గమనార్హం. దీనివల్ల ప్రజలు స్వచ్ఛందంగానే ఇంధన వాడకాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.














Click it and Unblock the Notifications