రాజధాని గ్రామాల్లో గ్రూపులు: ఆందోళనలో ప్రజలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంత గ్రామాలు రాజకీయ, సామాజిక వర్గాలుగా విడిపోతుండటంతో ప్రజల జీవన స్థితిగతులు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనున్నాయి. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రాజధాని నిర్మిస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో తుళ్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజికవర్గం అధికంగా ఉండగా తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజికవర్గం బలంగా ఉంది. ఈ కారణంగానే రాజధాని ప్రకటన వెలువడిన మరుక్షణం నుండి ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో కలకలం రేగింది.
స్వల్పఘర్షణలతో పాటు నాయకుల పర్యటనల సమయాల్లో ఫ్లెక్సీల ప్రదర్శన కూడా ఓ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. తుళ్లూరు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శిస్తున్నారు.
డిసెంబర్లో రాజధాని ప్రకటన వెలువడిన తర్వాత ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డుమార్గంలో పర్యటించలేదు. అదేసమయంలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహనరెడ్డి రాజధాని గ్రామాల్లో పర్యటించినప్పటికీ తాడేపల్లి, మంగళగిరి మండలాలకే పరిమితమయ్యారు.
బహిరంగంగా ప్రకటించనప్పటికీ మూడు మండలాలు భూముల సమీకరణలో అసంతృప్తిని నర్మగర్భంగా ప్రభుత్వానికి తెలియజేశాయి. అందువల్లే భూ సమీకరణ అనుకున్న సమయానికంటే ఆలస్యమైంది. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు పర్యటించిన సమయాల్లో రైతులు నిలదీసిన సంఘటనలు అనేకం.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, 42 మంది ప్రజాప్రతినిధులు తుళ్లూరు మండలంలో పర్యటించినప్పుడు వాదులాటకు దిగడమే కాక అనేక గ్రామాల్లో స్వచ్ఛంధంగా భూములిస్తున్నామనే రైతులు వారిని విమర్శించారు. ఇప్పటికీ సింగపూర్, జపాన్ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించలేని పరిస్థితి నెలకొంది.
సింగపూర్ ప్రతినిధులు తుళ్లూరు మండలంలో కాలు కింద పెట్టకుండానే కారులో పర్యటన పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్లో రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉండబోతాయనే ఆందోళనలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉన్నారు.