కర్నూలులో కాస్త తగ్గినా:ఆ రెండు జిల్లాల్లోనే తీవ్రం:కొత్తగా మళ్లీ 80 కరోనా కేసులు:సిక్కోలులో మరొకరు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు, గంటగంటకూ పెరిగిపోతోంది. ఈ నెల 20వ తేదీన తొలిసారిగా 75 పాజిటివ్ కేసులు నమోదైన తరువాత.. ఆ సంఖ్యలో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుదల చోటు చేసుకోలేదు. కొత్తగా మళ్లీ 80 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 80ని అందుకోవడం ఈ వారం రోజుల వ్యవధిలో ఇది మూడోసారి. దీనితో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. కృష్ణా-33, గుంటూరు-23, కర్నూలు-13, నెల్లూరు-7, పశ్చిమ గోదావరి-3, శ్రీకాకుళంలో ఒక కేసు నమోదు అయ్యాయి.
మాస్క్ షేప్లో ఉల్క: రెండురోజుల్లో భూమికి అత్యంత సమీపంగా: ఇప్పుడున్న కరోనా చాలదన్నట్లుగా
కృష్ణాలోనే అత్యధికం..
కొత్తగా నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లా వాటా అధికంగా ఉంది. ఈ జిల్లాలో 33 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం ఇదే జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో మళ్లీ 33 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో కృష్ణా జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 210కి చేరుకుంది. ఈ జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని, డిశ్చార్జి అయిన వారం సంఖ్య 29 కాగా.. ఎనిమిది మరణించారు.
కర్నూలులో తగ్గినా..టాప్ పొజీషన్లోనే
అత్యధిక కేసులు నమోదువుతూ వచ్చిన జిల్లాల్లో ఇప్పటిదాకా టాప్ పొజీషన్లో ఉన్న కర్నూలు జిల్లాలో.. దీని తీవ్రత కాస్త తగ్గినట్టుగానే కనిపిస్తోంది. 24 గంటల్లో ఈ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 13. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఆదివారం విడుదల చేసిన బులెటిన్లో కర్నూలు జిల్లాలో ఏడు కేసులే నమోదు అయ్యాయి. ఆ మరుసటి రోజు కూడా దాని సంఖ్య 13కే పరిమితం కావడం ఊరట కలిగించే విషయం. ఈ జిల్లాలో యాక్టివ్గా ఉన్న కేసులు 252.
గుంటూరులో 23
కొత్తగా గుంటూరు జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 23. ఇప్పటిదాకా 28 మంది ఆసుపత్రులు, ఐసొలేషన్ వార్డుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఈ జిల్లాలో ఇప్పటిదాకా రికార్డయిన కేసుల సంఖ్య 237కు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాలో మరొకరికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటిదాకా మూడు కేసులు నమోదు కాగా.. 24 గంటల వ్యవధిలో ఇంకొకరు దీని బారిన పడినట్లు తెలిపారు.
ఓవరాల్గా కర్నూలులో
కొత్తగా నమోదైన కరోనా కేసుల అనంతరం జిల్లాలవారీగా అనంతపురం-53, చిత్తూరు-73, తూర్పు గోదావరి-39, గుంటూరు-237, కడప-58, కృష్ణా-210, కర్నూలు-292, నెల్లూరు-79, ప్రకాశం-56, శ్రీకాకుళం-4, విశాఖపట్నం-22, పశ్చిమ గోదావరి 54 కేసులు ఉన్నాయి. విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం మీద 235 మంది డిశ్చార్జి అయ్యారు. 31 మంది మరణించారు. 74, 551 మంది పరీక్షలను నిర్వహించారు. వారిలో 73,374 మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చినట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
Recommended Video