ఏపీలో కోవిడ్ విజృంభణ: ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు నమోదు: ఈ జిల్లాల్లో అత్యధికం
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుదల బాట పట్టాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 10 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.
మొత్తం 49 యాక్టివ్ కేసులలో నిశిత పరిశీలన కొనసాగుతోంది. వీరిలో ప్రస్తుతం 24 మంది బాధితులు వివిధ ఆసుపత్రులలో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ యూనిట్ లల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 25 మంది రోగులు తమ ఇళ్లలోనే ఉంటూ హోమ్ ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటోన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న మరోర అయిదుమంది వేర్వేరు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

నమోదైన ఈ నూతన కేసులలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో వెలుగుచూశాయి. ఇక్కడ గత 24 గంటల్లో మొత్తం మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో కొత్త కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
యాక్టివ్ కేసుల్లో తూర్పు గోదావరి జిల్లా మొదటిస్థానంలో ఉంటోంది. ఇక్కడ మొత్తం 11 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీని తర్వాత గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ తొమ్మిది కేసులు రికార్డయ్యాయి. వైఎస్ఆర్ కడప- 8, విశాఖపట్నం- 5, ఎన్టీఆర్- 3, కాకినాడ- 2, ఏలూరు- 2, బాపట్ల- 2 కేసులు ఉన్నాయి.
పాజిటివ్ కేసులు నిరంతరం నమోదు కావడంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. కరోనా సోకిన బాధితుల పరిచయస్తులను అతి త్వరగా గుర్తించడానికి వీలుగా రంగంలోకి రాపిడ్ రెస్పాన్స్ బృందాలను దించింది. అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు త్వరితగతిన పూర్తి చేసేందుకు సరిపడా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కిట్లను అన్ని పీహెచ్సీలు, జీజీహెచ్లలో అందుబాటులో ఉంచారు.












Click it and Unblock the Notifications