Covid: మళ్లీ కరోనా కలకలం, నలుగురు మృతి. వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కొవిడ్ కేసులు వెలుగుచూడటం స్వల్ప కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా చెదురుముదురుగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. జూన్ 26 నుంచి జులై 16వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 12 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దురదృష్టవశాత్తూ వీరిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అయితే, మరణించిన వారంతా ఇదివరకే తీవ్రమైన రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), కిడ్నీ సంబంధిత ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కడపలోనే ఎక్కువ ప్రభావం
ఈ ఏడాది మొట్టమొదటి కేసు జూన్ 26న కడప జిల్లాలో వెలుగుచూడగా.. ఆ తర్వాత జులై మొదటి రెండు వారాల్లో మిగిలిన 11 కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం బాధితుల్లో ఇద్దరు వ్యక్తులు.. ఇదివరకే కొవిడ్ సోకిన రోగులతో సన్నిహితంగా మెలిగినట్లు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా చూస్తే కడప జిల్లాలోనే అత్యధికంగా 8 కేసులు వెలుగుచూశాయి. గుంటూరు జిల్లాలో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాలు, మండలాల పరిధిలో విడివిడిగా నమోదైనవేనని, ఒకేచోట గుంపుగా వైరస్ వ్యాప్తి చెందిన దాఖలాలు లేవని వీరపాండియన్ వివరించారు.
పరీక్షలు - ప్రస్తుత పరిస్థితి
గత కొద్దిరోజుల్లో రాష్ట్రంలో లక్షణాలున్న 67 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్గా తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన మరో బాధితుడికి తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా వైరస్ ఉన్నట్లు బయటపడింది. మరణించిన నలుగురిలో ముగ్గురు కడప జిల్లాకు, ఒకరు కాకినాడ జిల్లాకు చెందినవారు.
ప్రస్తుతం ఈ వైరస్ రూపాంతరం చెందిందా లేదా అనే విషయాన్ని పరీక్షించడానికి, వైరస్ జన్యు స్వరూపాన్ని (జీనోమ్ సీక్వెన్సింగ్) విశ్లేషించేందుకు ఐదు నమూనాలను జులై 9న పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV)కు పంపించారు. ప్రస్తుతం వైరస్ బాధితుల్లో ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. మరో ముగ్గురు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా కేరళలోనే టాప్
జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 115 కేసులు రాగా, కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు చొప్పున రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణ, ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications