తొలిసారి ఇలా, వారి దగ్గరకే భోజనాలు.. మహానాడు ప్రత్యేకతలెన్నో: బీజేపీ, పవన్-జగన్ టార్గెట్!
అమరావతి: తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. విజయవాడలో 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది. కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో మహానాడు జరగనున్న నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు.
మహానాడుకు భారీ బందోబస్తు కల్పిస్తున్నట్టు తెలిపారు. రెండువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడికి వచ్చే ప్రముఖులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నామని, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, వలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు.
మహానాడులో తీర్మానాలు
వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు ఇక్కడి నుంచే సమరశంఖాన్ని పూరించనున్నారు. ఈ ఉదయం 8.30 గంటల నుంచి ప్రతినిధుల నమోదు ప్రారంభమవుతుంది. అనంతరం డ్వాక్రా బజార్, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభిస్తారు. మహానాడు ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో 36 తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు. ఏపీకి సంబంధించి 22, తెలంగాణకు సంబంధించి 8 ఉంటాయి.
అతిపెద్ద వేదిక
ఇక మహానాడుకు దారితీసే మార్గాలు తెలుగుదేశం జెండాలు, స్వాగత తోరణాలు, నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. విజయవాడ రహదారులు పుసుపు రంగుతో నిండిపోయాయి. వేదిక సమీపంలో ఎన్టీఆర్, చంద్రబాబుల భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మహానాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 120/60 అడుగుల అతిపెద్ద వేదిక సిద్ధమైంది. దీనిపై దాదాపు 400 మందిని కూర్చోబెట్టనున్నారు. వీఐపీలకు అతిథులకు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదీ ఈ సమావేశాల ప్రత్యేకత
ఎండలు బాగా ఉండటంతో ప్రాంగణమంతా కూలర్లు, ఏసీలను పెట్టారు. ఎవరికీ ప్రత్యేక పాస్లు ఇవ్వకుండా, పార్టీ సభ్యత్వ కార్డే పాస్గా కార్యకర్తలను లోపలికి పంపాలని నిర్ణయించడం ఈ సమావేశాల ప్రత్యేకత. మహానాడుకు వచ్చిన వారందరికీ రుచికరమైన విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 వేలమందికి ఉదయం టిఫిన్, 40 వేల మందికి రెండు పూటల భోజనం సిద్ధమవుతుండగా, దాదాపు 20 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్రముఖుల కోసం ప్రధాన వేదిక వెనుక భోజన వసతి ఏర్పాటైంది. సుమారు 2 వేలమంది కూర్చుని తినడానికి, మిగతావారికి బఫే సిస్టమ్లో భోజనాలు అందనున్నాయి.
విజయవాడలో నాలుగో మహానాడు
టీడీపీ స్థాపించిన విజయవాడలో జరిగే నాలుగో మహానాడు ఇదే కావడం గమనార్హం. గతంలో 1983, 1998, 2000 సంవత్సరాల్లో మహానాడు విజయవాడలో జరిగింది. 1983, 2000 సంవత్సరాల్లో సిద్దార్ధ కళాశాల వేదికకాగా, 1988లో మాత్రం తాడేపల్లి సమీపంలోని కృష్ణానది ఒడ్డున 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు జరిగింది. నారాయణ, చైతన్య, వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన వసతిగృహాల్లో పదిహేనువేల మందికి బస ఏర్పాటు చేశారు. పదకొండు చోట్ల పార్కింగ్ వసతి కల్పించారు. వాహనాల డ్రైవర్లకు వారున్న చోటుకే భోజనాలు అందిస్తారు. ఈ ప్రాంగణానికి చేరుకునేందుకు నాలుగు మార్గాలు ఉన్నాయి. సీఎం, మంత్రులు, ఇతర ప్రముఖులు పంటకాలువ రోడ్డు మీదుగా వస్తారు. వారు నేరుగా వేదిక వెనుక పక్కకు చేరుకుంటారు. మహానాడు రద్దీ దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ మహానాడులో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని, పవన్ కళ్యాణ్ - వైయస్ జగన్లతో కలిసి తమను దెబ్బతీయాలని చూస్తుందని చంద్రబాబు సహా ఇతర నేతలు వారిని టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.