‘హైదరాబాద్లో సచివాలయాన్ని ఖాళీ చేస్తేనే అమరావతికి గుర్తింపు’
హైదరాబాద్: విభజనతో ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో సీమాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించింది. ఈ నేపథ్యంలో పదేళ్లపాటు హైదరాబాద్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం జరిగింది. అయితే నూతన ఆంధ్రప్రదేశ్ తన రాజధానిని అమరావతిగా నిర్ణయించింది.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిని అధికారికంగా గుర్తించాలంటే హైదరాబాద్లోని సచివాలయాన్ని పూర్తిగా ఖాళీచేయాల్సిందేనని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలా చేయకుండా కొనసాగుతామంటే అమరావతిని రాజధానిగా ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు.
అంతేగాక, ఈ మేరకు ఏపీ సర్కార్ కేంద్రానికి అధికారికంగా లేఖ అందజేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్ను అట్టిపెట్టుకొని మిగతా బ్లాక్లను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం ఎల్బ్లాక్ను కూడా అందజేసి వెళ్లకతప్పడం లేదు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఓటుకు నోటు కేసు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మకాంను విజయవాడకు మార్చారు. సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసుకొని క్యాబినెట్ సమావేశాలు, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
కానీ, అధికారికంగా సచివాలయం హైదరాబాద్లోనే కొనసాగుతోంది. ప్రజల నుంచి ఒత్తిడి పెరుగడంతోపాటు స్వరాష్ట్రంలోనే పాలన కొనసాగించేందుకు అమరావతి ప్రాంతంలో తాత్కాలిక సచివాలయానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో శాఖల వారీగా ఉద్యోగులు, సిబ్బంది హైదరాబాద్ నుంచి తరలివెళ్తున్నారు.
సచివాలయంలో కొన్నివిభాగాల అధికారులకు కూడా అక్కడికి వెళ్లిపోయారు. ఆగస్టు నెల చివర లేదా సెప్టెంబర్ నెలాఖరుకు హైదరాబాద్ నుంచి అన్నివిభాగాలను ఏపీకి తరలించనున్నట్లు సమాచారం.
కాగా, అమరావతి రాజధాని కోసం సచివాలయాన్ని పూర్తిగా ఖాళీ చేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలా జరిగితే ఇక నుంచి ఏపీ రాజధాని అమరావతి నుంచే ఆ రాష్ట్ర అధికారిక కార్యకలాపాలన్నీ జరుగుతాయి. దీంతో ఏపీ రాజధాని అమరావతిగా అధికారిక గుర్తింపు లభించనుంది.












Click it and Unblock the Notifications