ప్రత్యేక హోదాకు సాంకేతిక ఆటంకాలున్నాయి: పురంధేశ్వరి
విజయవాడ: కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వడానికి కొన్ని సాంకేతికపరమైన ఆటంకాలున్నాయని, ఈలోగా కేంద్రం రాష్ట్రానికి అదనపు నిధులను కేటాయిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసం కేంద్రం 12 సంస్థలను కేటాయించిందని బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై కొన్ని రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ నెరవేరుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెప్పారని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీలను అన్నింటినీ నెరవేరుస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఎపి రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే, ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు కలిగించడానికి ప్రతిపక్షాలు రాష్ట్రంలో నిరసనలు చేపడుతున్నాయని ఆమె అన్నారు.
గత ఆరు నెలల కాలంలో కేంద్రం రాష్ట్రానికి 7,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్రంపై ఏ విధమైన భారం పడకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా తామే చేపడుతామని కేంద్రం స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన 1,950 కోట్ల రూపాయలను కూడా తిరిగి ఇవ్వడానికి కేంద్రం అంగీకరించినట్లు తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులపై, చేసిన వ్యయంపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని పురంధేశ్వరి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.