ఏపీలో మండిపోతున్నఎండలు...రాబోయో రోజుల్లో మరింత అధిక ఉష్ణోగ్రతలు
అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వేసవి నడిమధ్యకు సమీపించక ముందే ఎండలు మాత్రం తారాస్థాయిలో మండిపోతున్నాయి. గడచిన వారంలోనే ఎపిలో అనేక చోట్ల అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఇదిలా ఉంటే రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండల తాకిడి మరింత అధికంగా ఉంటుందని, కోస్తా పరిధిలోని పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో 43 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు మిగిలిన జిల్లాల్లో కూడా 41 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలే నమోదు అవుతాయని హెచ్చరిస్తోంది.
రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతల నమోదు గురించి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు ఎపి ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 21 తేదీ నుంచి 22 తేదీ వరకూ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే ఎక్కువ స్థాయి ఉండొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే ఇదే కాల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఇంచుమించు 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశముందని తెలిపింది. కాబట్టి ఈ నాలుగైదు రోజుల్లో మండిపోయే ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ హెచ్చరిస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలి కాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు చూస్తే విజయవాడ, అమరావతి, గుంటూరు, తిరుపతిలలో 43 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డయింది. అలాగే విజయనగరంలో 42, కడప, శ్రీకాకుళం, ఏలూరులో 41 డిగ్రీలు, విశాఖ, కాకినాడ, నెల్లూరు, కర్నూలులో 40 డిగ్రీలు, అనంతపురం, ఒంగోలులో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాలవారీగా ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా 122 మండలాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎపిలో సగటు ఉష్ణోగ్రతల్లో 5 నుంచి 6 డిగ్రీల మేర పెరుగుదల నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇప్పటికే వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ఇవి మరింత ఉదృతం కానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.