2029 నాటికి ఏపీని అగ్రగామిగా నిలుపుతా: బాబు
విశాఖపట్నం: 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్ధానంలో ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన ఫార్ట్యూన్ ఇండియా 500 సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నోవాటెల్లో జరిగే ఈ సదస్సులో పలువురు పారిశ్రామిక సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. సంచికను ఆవిష్కరించిన అనంతరం ఆయా సంస్థల ఎండీలు, సీఈవోలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త పరిశ్రమల కోసం వచ్చే దరఖాస్తులకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో గ్రామాల్లో కూడా పట్టణ స్ధాయి వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. మూడేళ్లలో అన్ని నివాసాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు పేట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైన ప్రాంతమని తెలిపారు. సముద్ర తీరానికి సమాంతరంగా మరో జాతీయ రహదారి నిర్మించనున్నట్లు చెప్పారు.
దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనుకూలమని ఇక్కడ విస్తారమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వేత్తలకు చంద్రబాబు పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం విశాఖ ఉత్సవ్లోగోను ఆవిష్కరించి తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు తిరిగి హైదరాబాద్కు రానున్నారు.