అమెరికా: నదిలో పడి ఏపీ యువకుడు మృతి, కల సాకారమవుతున్న వేళ విషాదం
హైదరాబాద్/అమరావతి: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో బోటు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందాడు. పైచదువుల కోసం అమెరికా వెళ్లిన మాదినేని సాయి ప్రవీణ్ అనే యువకుడు తనన కలలను సాకారం చేసుకుంటున్న తరుణంలో ఇలా జరగడం హైదరాబాద్లో నివాసం ఉంటున్న అతని కుటుంబంలో విషాదం నింపింది.
వర్జీనియాలో ఆర్కిటెక్ట్గా సాయి ప్రవీణ్..
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతి మండలం అత్తలూరు గ్రామానికి చెందిన మాదినేని వెంకట శ్రీనివాసరావు విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఆయన కుమారుడు సాయి ప్రవీణ్ కుమార్(31) అమెరికాలోని వర్జీనియాలో ఆర్కిటెక్ట్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రమాదవశాత్తు నదిలో పడి ప్రవీణ్ మృతి..
కాగా, గత గురువారం స్నేహితులతో కలిసి ఆస్టిన్లోని ఓ జిమ్కు వెళ్లిన అనంతరం సమీపంలో ఉన్న సరస్సు సందర్శనకు వెళ్లారు. అక్కడ ఫెడల్ లాక్ బోటులో విహరిస్తూ ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యాడు. తీవ్రంగా గాలింపు చేపట్టి శనివారం అతని మృతదేహాన్ని సహాయక బృందాలు గుర్తించాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం తిరుపతిలోని ఆయన సోదరికి అతని స్నేహితులు విషయాన్ని తెలియజేశారు.
కలలు నిజమవుతున్నవేళ విషాదం
కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రవీణ్ స్వస్థలమైన అత్తలూరులోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందిన కొడుకు జీవితంలో స్థిరపడుతున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రవీణ్ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అమెరికాలోనే ఉన్నత చదవులు పూర్తి చేసిన ప్రవీణ్ మంచి జీతంతో ఉద్యోగంలో చేరాడు. 2019లోనే వర్జీనియాలో సొంతింటి నిర్మాణం కూడా చేపట్టడం గమనార్హం.
Recommended Video
ప్రవీణ్కు త్వరలో పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు
అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడిన ప్రవీణ్కు త్వరలో వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. వివాహ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. కాగా, గురువారం ఉదయంతో తల్లిదండ్రులతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రవీణ్ కూడా చెప్పారు. అవే తమ కుమారుడి చివరి మాటలని ప్రవీణ్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే స్వస్థలానికి రావాల్సి ఉండగా, కరోనా లాక్డౌన్ కారణంగా ప్రయాణం వాయిదా పడిందని తెలిపారు. అప్పుడే వచ్చివుంటే తమ కుమారుడు తమతోనే ఉండేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.