విశాఖే రాజధాని- ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే ఊరుకోం-ఏయూ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు
అమరావతి రాజధాని కోరుతూ రైతులు అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రపై ఉత్తరాంధ్రలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉత్తారంధ్రకు రాజధాని రావడం మీకు ఇష్టం లేదా అన్నట్లుగా అక్కడి ప్రజలు అమరావతి రైతుల్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ పాదయాత్ర వ్యతిరేకం కాదని చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యల మధ్యలో ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రా యూనివర్శిటీలోని హిందీ భవన్ లో నిర్వహించిన బోయి భీమన్న జయంతి కార్యక్రమంలో ప్రసంగం చేసిన వీసీ ప్రసాద్ రెడ్డి.. అమరావతి పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారని, ఇప్పుడు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తామంటే ఊరుకుంటామా అని వీసీ ప్రసాద్ రెడ్డి సభికుల్ని ప్రశ్నించారు. రాబోయే కాలంలో విశాఖే రాజధానిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి.
ఇప్పటికే విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులతో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ప్రభుత్వం విమర్శలు చేయిస్తోంది. అలాగే పాదయాత్రతో దండయాత్ర చేస్తారా అంటూ మంత్రులే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగి అయిన వీసీ ప్రసాద్ రెడ్డి సైతం దండయాత్ర చేస్తామంటే ఊరుకుంటామా అని వేసిన ప్రశ్న వివాదం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలకు వ్యతిరేకంగా వీసీ ఎలా వ్యాఖ్యలు చేస్తారంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.