ఆంధ్రజ్యోతి కథనం: జగన్కు గురిపెడితే, చంద్రబాబుకు తగిలిందా?
ఆంధ్రజ్యోతి ఒకటి తలిస్తే మరోటి జరిగినట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. జగన్పై ఎక్కుపెట్టిన వార్తాకథనం చంద్రబాబుకు తగిలినట్లు చెబుతున్నారు.
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీపై ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసిన వార్తాకథనాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడినట్లే కనిపిస్తున్నారు.
బిజెపితో ఏ మాత్రం దూరం జరగడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదు. అయితే, ఆంధ్రజ్యోతి వార్తాకథనంతో బిజెపిని తెలుగుదేశం పార్టీకి దూరం చేసే పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. మోడీతో భేటీ విషయంలో ఆంధ్రజ్యోతి వార్తాకథనాలు జగన్ను లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా మోడీని కూడా తప్పు పట్టే విధంగా ఉన్నాయనే భావన వ్యక్తమవుతోంది.
ప్రధానికి జగన్ సమర్పించిన లేఖల లీకు వ్యవహారం మరింతగా బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుపై బిజెపి నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న ఇద్దరు ఈడి అధికారుల గురించి బిజెపి నాయకులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

లీకుతో దుమారం...
ప్రధాని మోడీని కలిసిన సందర్భంలో జగన్ ఇచ్చారని భావిస్తున్న వినతిపత్రం ఆంధ్రజ్యోతికి, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్కు లీకు కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. రాష్ట్ర సమస్యల పరిష్కారం పేరుతో మోడీని ఈనెల 10న ప్రధానిని కలిసిన జగన్ మోడీ కాళ్లు పట్టుకుని తనను వేధిస్తున్న ఈడీ అధికారులపై ఫిర్యాదు చేశారు తప్ప, రాష్ట్ర సమస్యలపై మాట్లాడలేదని మీడియాలోప్రత్యక్షమైన లేఖ జగన్కు చిక్కులు తెచ్చిపెట్టడానికి బదులు బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య అగ్గి రాజేసే ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది.

జగన్కు మేలు చేసిన కథనం
తాము ప్రధాని మోడీకి మిర్చిరైతు, అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వ అవినీతితోపాటు ప్రత్యేక హోదా అంశంపై వినతి పత్రం ఇచ్చామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదాపై కూడా మాట్లాడామని వైయస్ జగన్ చెప్పారు. చంద్రబాబుపై ఫిర్యాదు చేశామని, చంద్రబాబు ప్రోద్బలంతో తనపై కక్ష సాధింపు చర్యలు సాగించే విధంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఫిర్యాదు చేశానని కూడా ఆయన చెప్పారు. అలా చెప్పుకుంటే తప్పేం ఉందనే జగన్ ప్రశ్నకు ఆంధ్రజ్యోతి కథనం ఊతమిచ్చిందని అంటున్నారు.

లేఖను తర్జుమా చేసి పంపించారు...
ఆంధ్రజ్యోతి ప్రస్తావించిన లేఖపై వచ్చిన ఆంధ్రజ్యోతి కథనంపై రాష్ట్ర బిజెపి నాయకులు కూడా అప్రమత్తమయ్యారు. గత కొంతకాలం నుంచీ తమ పార్టీని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన లీకు లేఖపై వచ్చిన వార్తాకథనాన్ని రాష్ట్ర బిజెపి నేతలు కొందరు పార్టీ కార్యాలయానికి, పీఎంఓకు ఆ వార్తాకథనాన్ని తర్జుమా చేసి పంపించారు. ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబుకు అండగా నిలుస్తూ జగన్పై దుమ్మెత్తిపోస్తుండడం పెద్దగా తమకు అభ్యంతరం కాకపోవచ్చు గానీ చంద్రబాబు కోసం తమను కూడా తప్పు పడుతోందని బిజెపి నాయకులు అంటున్నారు. ఇది చంద్రబాబు ప్రోద్బలంతోనే జరుగుతుందనే అభిప్రాయం బిజెపి నాయకుల్లో ఉంది. ఇది చంద్రబాబుకు ఏదో మేరకు ఇబ్బంది కలిగించే విషయమనే అంటున్నారు.

కేంద్ర మంత్రుల ప్రమేయంతోనే..
ఆంధ్రజ్యోతి ప్రచురించిన జగన్ లేఖ పిఎంవో నుంచి లీకు అయి ఉండదని అంటున్నారు. హోంమంత్రిత్వ శాఖ నుంచి చెన్నై ఈడీ కార్యాలయం వరకూ జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల నేపథ్యంలో ఏదో ఒకచోట లీకు అయి ఉండవచ్చునని బిజెపి నాయకులు అంటున్నారు. ‘ఏ ఈడీ అధికారి నుంచి ఆ లేఖ వచ్చిందో ఆ పత్రికనే అడగండి. బాబు బిజెపిలో తన వాళ్లను మంత్రులుగా పెడతాడు. తనకున్న మంత్రిని కేంద్రంలో కూర్చోబెట్టుకుని ఆయనతోను, బాబుకు సపోర్టు చేస్తున్న మంత్రులను ఉపయోగించుకుని మళ్లీ ఇప్పుడు నాపై కుట్ర చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్తోనూ ఇదే కుట్ర చేయించాడు' అని జగన్ వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ లీకు వ్యవహారమంతా కేంద్ర మంత్రుల ప్రమేయంతో జరిగిందని భావించడానికి వీలు కలుగుతోంది. ఆ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందినవారు అయి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబు పట్ల బిజెపి వైఖరి ప్రతికూలంగా మారడానికి కారణమవుతుందని భావిస్తున్నారు.

చంద్రబాబు అప్రమత్తం...
ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తాకథనం బిజెపితో సంబంధాలను దెబ్బ తీసే ప్రమాదం కనిపించడంతో చంద్రబాబు అప్రమత్తమైనట్లు కనిపిస్తున్నారు. మోడీని ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించవద్దని, కేవలం జగన్ లక్ష్యంగా ఉండాలని చంద్రబాబు అందుకే ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు. బిజెపితో సంబంధాలు తెగేదాకా లాగితే నష్టపోయేది తానే ఉనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పరస్పరం బురద చల్లుకుంటున్నప్పటికీ ప్రధాని, ఆయన కార్యాలయం విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications