అసలు పొరపాటు ఎవరిది?: ఆంధ్రజ్యోతి వర్సెస్ వైఎస్ భారతి, ఆ పోస్టుపై రచ్చ..
భారతి వివరణతో ఆంధ్రజ్యోతిని తప్పుపట్టే పరిస్థితి ఏర్పడింది.
Recommended Video
కర్నూలు: సోమవారం నాడు ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురితమైన ఓ కథనం వివాదాస్పదంగా మారింది. వైఎస్ భారతి చేసిన తప్పుడు ట్వీట్ అంటూ ఆంధ్రజ్యోతి ఆ కథనాన్ని వెలువరించగా.. తనకసలూ సోషల్ మీడియాలో ఖాతానే లేదని, మీరే తప్పుడు కథనాన్ని వెలువరించారన్న రీతిలో వైఎస్ భారతి కౌంటర్ ఇచ్చారు.
ఏంటా కథనం:
ఆంధ్రజ్యోతి కథనంలో ఏముందంటే!.. పంట పొలంలోని ఓ పంపు కింద జగన్ నీళ్లు తాగుతున్నట్టు వైఎస్ భారతి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. ' ఈ ఒక్క చిత్రం చాలు ఎన్నో విషయాలకు సమాధానం చెప్పడానికి' అని పోస్టులో పేర్కొన్నారు.
ఫోటోలో 'జగన్' కాదు
అయితే ఇందులో ఉన్నది జగన్ కాకపోవడంతో.. 'భారతి తన భర్తనే గుర్తించలేకపోయారా?' అని కొంతమంది ప్రశ్నించారు. ఇక టీడీపీ అభిమానులైతే.. 'సీమలో పచ్చని పొలాల వద్ద ధారాళంగా నీరు వస్తున్న పంపులో జగన్ దాహం తీర్చుకున్నారు. ఇది టీడీపీ చేసిన అభివృద్ది అని పేర్కొన్నారు. నిజానికి ఆ పోస్టులో ఉన్నది సాక్షి రిపోర్టర్ ప్రదీప్ అని చెబుతున్నారు.
ఆ పోస్టు నాది కాదు
సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ కావడంతో.. అది కాస్త వైఎస్ భారతి దృష్టికి వచ్చింది. దీంతో పోస్టుపై ఆమె స్పందించారు. అసలు తనకు ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఖాతాలు లేవని స్పష్టం చేశారు. ఆ ఫోటో తాను పోస్టు చేసింది కాదని చెప్పారు. తన పేరుతో ఎవరైనా ఫేక్ ఐడీ సృష్టించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి కథనం పూర్తిగా వాస్తవ దూరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.
అసలు పొరపాటు ఎవరిది?
భారతి వివరణతో ఆంధ్రజ్యోతిని తప్పుపట్టే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియా ఖాతా భారతిదేనా? కాదా? అన్న విషయాన్ని ధ్రువీకరించుకోకుండా.. పత్రిక మొదటి పేజీలో హైలైట్ అయ్యేలా కథనాన్ని ప్రచురించడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. జగన్ పాదయాత్ర చేస్తున్న వేళ.. ఇలాంటి కథనాలతో వైసీపీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారన్న వారు లేకపోలేదు. చూడాలి మరి భారతి వివరణ పట్ల ఆంధ్రజ్యోతి స్పందిస్తుందో.. లేదో!.