ఏపీలో మంటపుట్టిస్తోన్న ఉష్ణోగ్రతలు
ఏపీలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య భారత్ నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని, తెలంగాణ, కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వెల్లడించింది. అండమాన్ సముద్ర తీరప్రాంతాల నుంచి ఈశాన్య భారత్ వరకూ నైరుతి గాలులు బలంగా కదులుతున్నాయని, మూడు రోజుల్లోగా అండమాన్ నికోబార్ దీవులపై నైరుతి రుతుపవనాలు విస్తరించే సూచనలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రాగల నాలుగైదు రోజుల్లో ఏపీ, తెలంగాణ, యానాం తదితర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో వర్షం కురిసే సూచనలున్నాయని, కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీలోని వివిధ జిల్లాల్లోని ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా : ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 45.68 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లా రాచెర్లలో 45.67,కర్నూలు జిల్లా మంత్రాలయంలో 43.5, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.3, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 43.04, తిరుపతి జిల్లా తొట్టంబేడులో 42.67, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల చాగలమర్రిలో 42.67, ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో 42.6, కడప జిల్లా కొండాపురంలో 42.5, బాపట్లలో 42.3, చిత్తూరులో 41.82, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 41.8, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 41.4, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 41.33, కాకినాడలో 41.2, విజయనగరం జిల్లా పూసపాటి రేగలో 40.8, విజయవాడలో 40.87, గుంటూరు జిల్లా మంగళగిరిలో 40.55, ఏలూరులో 40.5, అనంతపురం జిల్లా గుత్తిలో 40.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications