దారి చూపించారు - పార్టీ మార్పుపై తేల్చేసిన అనిల్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ముఖ్య నేతలు పలువురు పార్టీ వీడారు. మరి కొందరు అదే బాటలో నడుస్తున్నార నే ప్రచారం ఉంది. ఈ సమయంలోనే మాజీ మంత్రి అనిల్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో..అనిల్ ఇక పార్టీలో కొనసాగేందుకు సుముఖంగా లేరనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారం పైన అనిల్ స్పందించారు. తాను వైసీపీని వీడటం పైన స్పష్టత ఇచ్చారు. నెల్లూరు రాజకీయాల పైనా కీలక వ్యాఖ్యలు చేసారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజా రాజకీయాల పైన స్పందించారు. తాను కొన్ని వ్యక్తిగత కారణాల వలన జిల్లాలో రాజకీయాలకు దూరంగా ఉన్నానని అనిల్ చెప్పుకొచ్చారు. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని స్పష్టం చేసారు. పాత కేసుల్లో తనను అరెస్ట్ చేయాలంటూ కొందరు నేతలు లోకేష్ వెంట తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. తన పైన ఎన్నిక కేసులు పెట్టినా భరిస్తానని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా చెల్లిస్తామంటూ అనిల్ హెచ్చరించారు. అరెస్ట్ ల పై కూటమి నేతలు తమకు ఒక దారి చూపించారని.. రానున్న కాలంలో తప్పకుండా వారికి ఇవే శిక్షలు తప్పని అనిల్ పేర్కొన్నారు.

తన మీద తప్పుడు కథనాలతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను వైసీపీ వీడుతున్నానే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ తోనే ఉంటానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేసారు. జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని అనిల్ పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంత కంటే ఎక్కువగా ఉండేవని చెప్పుకొచ్చారు. కానీ, తాము అలా చేయలేదన్నారు. ఈ సారి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం పరిస్థితులు గతం కంటే భిన్నంగా ఉంటాయని అనిల్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications