ఏపీలో అన్నదాత నిధుల విడుదల..! రైతులకు చంద్రబాబు కీలక సూచన..!
దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ 21 విడత నిధుల్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇవాళ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నిధుల్ని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రైతులకు పలు కీలక సూచనలు చేశారు.
కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు.. రెండో విడతగా రూ.7 వేల చొప్పున 46,85,838 రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ చేశారు. దీనికోసం రూ.3,135 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాలకు కూటమి సర్కారు జమ చేస్తోంది. రాష్ట్రంలోని అర్హులైన రైతులకు రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్ధిక చేయూతకు నిర్ణయించారు.

మొదటి విడతలో ఈ ఏడాది ఆగస్టు 2న రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు అన్నదాతల ఖాతాలకు జమ చేయగా.. రెండు విడతల్లో రూ.14 వేలను రైతుల ఖాతాలకు జమ చేసినట్లు అయింది. కేవలం 4 నెలల కాలంలోనే రూ.6309.44 కోట్ల మేర అన్నదాతలకు ప్రభుత్వం ఆర్ధిక ప్రయోజనం కల్పించింది. ఈ సందర్బంగా కమలాపురంలో మాట్లాడిన సీఎం.. ప్రకృతి సేద్యంలో మన రాష్ట్రం ముందు ఉండాలని కోరారు. అప్పుడే రైతులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

తాను రైతు బిడ్డనని, తన తండ్రి వ్యవసాయం చేస్తుంటే తాను కూడా సహకరించానని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రైతులు అందరూ టెక్నాలజీ వినియోగిస్తేనే సాగు వ్యయం తగ్గుతుందన్నారు. అన్నదాతలు వ్యవసాయంలో పాత విధానాల్ని వదిలి కొత్త మార్గాల్ని ఆన్వేషించాలన్నారు. కొన్ని ప్రభుత్వాలు ఆదుకుంటాయి, మరికొన్ని ఆదుకోవు. అప్పుడు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి కాబట్టే రైతులకు మేలు జరుగుతోందని సీఎం తెలిపారు. వ్యవసాయం రంగ అభివృద్ధికి 5 సూత్రాలు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు ఇవే పంచసూత్రాలు అన్నారు.












Click it and Unblock the Notifications