రిషికేశ్వరిలా.. కానీ: మరో బిటెక్ అమ్మాయి మృతి, ర్యాగింగ్ వీడియోని ఫేస్బుక్లో పెట్టిందని..!
గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లాలో మరో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జిల్లాలోని మలినేని ఇంజినీరింగ్ కళాశాలలో సునీత అనే యువతి బిల్డింగ్ పై నుంచి పడి మృతి చెందింది. కిందపడిన ఆమెను ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందింది.
ఇప్పటికే జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య సంచలనం రేపుతోంది. ర్యాగింగ్ కారణంగానే రిషికేశ్వరి మృతి చెందింది. ఇప్పుడు సునీత మృతి చెందడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతి చెందిన సునీత ప్రకాశం జిల్లా చందలూరు గ్రామానికి చెందినదిగా తెలుస్తోంది. సునీత ఆత్మహత్య చేసుకుందా? ఎవరైనా భవనం పైనుంచి తోసివేశారా? ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా వేరే కారణాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.
ర్యాగింగ్ కోణమేనా, కానీ?
మలినేని ఇంజనీరింగ్ కాలేజీ భవనం పై నుంచి పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సునీత మరణం వెనుకా ర్యాగింగ్ భూతమే ఉందని వార్తలు వస్తున్నాయి.
కళాశాలలో జరుగుతున్న ర్యాగింగ్ వ్యవహారాలను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో, ర్యాగింగ్ను వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దానిని ఆమె సెల్ ఫోన్లో వీడియో తీసింది. ఈ విషయాన్ని తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేశారు.
ప్రిన్సిపాల్ సునీతను పిలిచి తీవ్రంగా మందలించాడని తెలుస్తోంది. దీంతో, మనస్తాపానికి గురైన ఆమె కళాశాల ఐదవ అంతస్తు నుంచి కిందకు దూకినట్టుగా తెలుస్తోంది. కళాశాలకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇందులో మరో కోణం కూడా వినిపిస్తోంది. సీనియర్లు, జూనియర్ల మధ్య గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఆ సమయంలో ఆమె ఫోటోలు తీసింది. ఆమె ఫోటోలు తీసిన విషయమై విద్యార్థులు ప్రిన్సిపల్కు చెప్పారు. సునీత ఫోటోలు తీసి ర్యాగింగ్ చేసినట్లు చెప్పారు. తన పైన చర్యలు తీసుకుంటారని ఆమె భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
పూరిళ్లు దగ్ధం
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని రఘుదేవపురం గ్రామంలోని కేశవరావుపేటలో బుధవారం మధ్యాహ్నం విద్యుదాఘాతంతో నలభై పూరిళ్లు దగ్ధమయ్యాయి. కేశవరావుపేటలో కొన్ని కుటుంబాలు కూలీపనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
తుపాకులతో బెదిరించి దోపిడీ
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో బుధవారం ఉదయం దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలు ఆయుధాలతో వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. నెల్లూరులోని కాపు వీధిలో ఉన్న జయంతి జ్యూయలర్స్ దుకాణంలోకి తుపాకులు ధరించిన దుండగులు చొరబడ్డారు.
షాపు యజమానిని తాళ్లతో కట్టేసి మూడు కిలోల బంగారు నగలు, రూ.50 లక్షల నగదును లూటీ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. స్థానికులను, దుకాణం యజమానిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.