జగన్ సర్కార్ కు కేంద్రం మరో ఊరట- రెండు రోజుల్లో రెండు వరాలు- లాబీయింగ్ ఫలిస్తోందా ?
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేనాటికి కేంద్రంతో మరీ అంత గొప్ప సంబంధాలేవీ లేవు. కానీ సీన్ కట్ చేస్తే ఈ రెండే్ళ్లలో కేంద్రంతో తమకు కావాల్సిన అంశాల్లో లాబీయింగ్ చేసి మరీ కనీసం కొన్ని హామీల్ని అయినా సాధించుకోవడంలో జగన్ సర్కార్ సక్సెస్ అవుతూనే ఉంది. కీలక హామీల సంగతి పక్కనబెడితే రాష్ట్రంలో రోజువారీ పాలన సాగేందుకు వీలుగా చేపట్టాల్సిన కొన్ని చర్యల విషయంలో కేంద్రం మద్దతిస్తూనే ఉంది. ఈ సంగతి మరోమారు రుజువైంది. అప్పులతో కాలం వెళ్లదీస్తున్న వైసీపీ సర్కార్ కు రెండు రోజుల క్రితం ఓ వరమిచ్చిన కేంద్రం.. 48 గంటల్లోనే మరో వరం కూడా ఇచ్చింది.
కేంద్రంతో జగన్ సంబంధాలు
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ సంబంధాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయని ఎవరైనా అడిగితే మరీ అంత గొప్పగా లేవనే సమాధానమే సర్వత్రా వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కేంద్రం వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించిన వైసీపీ అధినేత ఈ రెండేళ్లలో రాష్ట్రానికి కావాల్సిన హామీల్ని మాత్రం సాధించుకోలేకపోయారు. దీంతో కేవలం తనకు కష్టమొచ్చినప్పుడు మాత్రమే కేంద్రం సాయం కోరుతున్నారన్న విమర్శలు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. తాజాగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి రోజురోజుకూ దిగజారుతున్న వేళ కేంద్రం సాయం లభించడం లేదన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రానికి మద్దతిచ్చి లాభం లేదని జగన్ ఎదురుదాడి మంత్రాన్ని కూడా ఆశ్రయించారు. అదే ఇప్పుడు పనికొస్తుందా అన్న చర్చ జరుగుతోంది.
అప్పులాంధ్రప్రదేశ్ కష్టాలు
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో మొదలైన భారీ అప్పుల పర్వం వైసీపీ ప్రభుత్వానికి వచ్చే సరికి సంక్షేమం పేరిట రూటు మార్చుకుంది. అంతే మిగతాదంతా సేమ్ టూ సేమ్. అప్పుడు చంద్రబాబు అభివృద్ధి పేరుతో చేసిన అప్పులు ఇప్పుడు జగన్ సంక్షేమం పేరుతో చేస్తున్నారంతే. వాస్తవానికి అభివృద్ధి పేరిట అప్పులు చేస్తే జనంలో సానుభూతి రాదని చంద్రబాబు ఉదంతం ఎప్పుడైతే నిరూపించిందో అప్పుడే జగన్ సంక్షేమం పేరుతోనే అప్పులు చేయడం మొదలుపెట్టేశారు. దీంతో అప్పులాంధ్రప్రదేశ్ కష్టాలు రెట్టింపయ్యాయి. అప్పుల భారం లెక్కలేనంతగా పెరిగిపోతోంది. దీంతో కేంద్రం కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్దితి వచ్చేసింది.
అప్పులకు కేంద్రం బ్రేకులు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రంతో సత్సంబంధాలు నెరిపారన్న కారణంతో అప్పులకు అనుమతులు ఇస్తూ పోయిన కేంద్రం.. ఇప్పుడు వైసీపీ హయాంలోనూ అదే బాట పట్టింది. అయితే మధ్యలో ఈ అప్పుల వ్యవహారం పతాకస్ధాయికి చేరడంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి పూర్తిగా తలకిందులైంది దీంతో తన తప్పు తెలుసుకున్న కేంద్రం... అప్పులకు బ్రేకులు వేయడం మొదలుపెట్టింది. రుణ పరిమితుల్లో కోతలతో మొదలైన ఈ వ్యవహారం.. ఈ ఏడాది ఆరంభంలో కొత్త అప్పులకు మూలధన వ్యయంతో లింక్ చేయడం వరకూ వెళ్లింది. దీంతో సహజంగానే జగన్ సర్కార్ కష్టాలు మరింత పెరిగాయి. అటు కేంద్రాన్ని అడగలేక, ఇటు ఉన్న వనరులతో ప్రభుత్వం నడపలేక నలిగిపోతున్నారు.
జగన్ సర్కార్ కు కేంద్రం ఊరట
ఉన్న అప్పులకు వడ్డీలు కడుతూ, ఎప్పటికప్పుడు కొత్త అప్పులు పుట్టక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ కు తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రుణ పరిమితుల్లో గతంలో భారీగా కోతలు విధించిన కేంద్రం.. తాజాగా రెండు రోజుల క్రితం వాటిలో సడలింపులు ఇచ్చింది. తద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో తొలి మూడు నెలల్లోనే భారీగా అప్పులు చేసేసిన జగన్ సర్కార్.. వచ్చే 9 నెలల్లో అప్పులకు దారులు వెత్కుకునే పరిస్ధితుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన కేంద్రం.. మిగిలిన 9 నెలల అప్పుల విషయంంలో కాస్త చూసీ చూడనట్లుగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఆ మేరకు రాష్ట్రానికి సమాచారం పంపింది.
రెండు రోజుల్లో జగన్ సర్కార్ కు మరో వరం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణాల పరిమితి విషయంలో రెండు రోజుల క్రితం సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. 48 గంటల్లోనే మరో వరం కూడా ఇచ్చింది. ఈసారి కొత్తగా బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పుల విషయంలో మూలధన వ్యయంతో పెట్టిన లింకుల్లోనూ సడలింపులు ఇచ్చింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అప్పు తీసుకోవాలంటే కచ్చితంగా ఇంత మూలధనం ఖర్చు చేయాల్సిందేనని గతంలో షరతు పెట్టింది. ఆ మేరకు ఖర్చు చేయకపోతే 0.5 శాతం మేర అప్పుల పరిమితిలో కోత పెడతామని షరతు విధించింది. ఆ షరతును ఇప్పుడు కొంతమేర సడలించింది. గతంలో అంచనా వేసిన లెక్కల ప్రకారం వైసీపీ సర్కార్ రూ.27589 కోట్లను మూలధన వ్యచం చేస్తేనే రూ.5309 కోట్లు అప్పులకు అనుమతిస్తామని చెప్పింది. ఇప్పుడు దాన్ని సవరించి రూ.26262 కోట్లు ఖర్చు చేస్తే చాలని తెలిపింది. ఇందులోనూ 20 శాతం మొత్తం తొలి మూడు నెలల్లో ఖర్చు చేస్తే చాలు కోత పెట్టిన అప్పుల్లో సగం తీసుకునేందుకు వెలుసుబాటు కల్పించింది.
Recommended Video
కేంద్రంతో లాబీయింగ్ ఫలిస్తోందా ?
అసలే అప్పులతో ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ సర్కార్ .. కేంద్ర ప్రభుత్వం కూడా షరతులతో ఇరుకునపెట్టడంతో రెండు నెలల పాటు దారుణమైన ఇబ్బందుల్ని చవి చూసింది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు కూడా పదో తేదీ తర్వాత ఇవ్వాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో ఇక లాభం లేదనుకుని కేంద్రం వద్దకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ను పంపింది. ఆయనతో పాటు ఆర్ధికశాఖ అధికారుల బృందం కూడా వెళ్లింది. కేంద్రంతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపింది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఆర్దికశాఖతో లింక్ ఉన్న ప్రతీ అధికారినీ కలిసింది. చివరికి అనుకున్న ఫలితాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. కేంద్రం రెండురోజుల గ్యాప్ లో ప్రకటించిన రెండు వరాలతో జగన్ సర్కార్ కు మరిన్ని అప్పులు చేసేందుకు వీలు కలిగింది.