జగన్ ప్రభుత్వానికి మరో షాక్: అమరావతి గ్రామాల్లో భూములపై: హైకోర్టు స్టే..తీర్పు రిజర్వ్..!
వివాదాస్పదంగా మారిన అమరావతి ప్రాంతంలో భూములను ఇతర ప్రాంతాల వారికి ఇళ్ళ స్థలాల కేటాయింపు నిర్ణయం పైన హైకోర్టు స్టే విధించించి. ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై స్టే ఇచ్చిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించటం సరికాదని స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీని పైన విచారించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి పరిధిలో భూ సమీకరణ కింద తీసుకున్న భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టం ఉందంటూ పిటీషనర్ వాదించారు. అయితే, కోర్టు దీని పైన తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. ప్రభుత్వం తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మీద స్పందించాల్సి ఉంది.

ప్రభుత్వ జీవో పై హైకోర్టు స్టే...
ఏపీ రాజధాని ప్రాంతంలో వేరే ప్రాంతాలవారికి భూములిస్తూ...వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే హైకోర్టు ఇచ్చింది. ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించి..అందులో భాగంగా రాజధాని పరిధిలోని భూమలను ఎంపిక చేసింది. దీని పైన స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107పై కోర్టు స్టే విధించింది. అమరావతి గ్రామాల్లోని భూములను సీఆర్డీఏ చట్టం ప్రకారం దుగ్గిరాల, విజయవాడ, మంగళగిరి వారికి కేటాయించటం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
ప్రధాని మంత్రి ఆవస్ యోజన లో కూడా ఇళ్ల నిర్మాణం జరిగిందని, దుగ్గిరాల, మంగళగిరి సీఆర్డఏ పరిధిలోనే వస్తాయని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, వాదనల తరువాత 51 వేలమందికి 1,215 ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 107 పైన స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది.

ప్రత్యామ్నాయ స్థలాల కోసం అన్వేషణ..?
ఈ నెల 25న ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కరోనా కారణంగా ఏప్రిల్ 14వ తేదీకి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అందులో భాగంగానే అమరావతి గ్రామాల్లో దాదాపు 51 వేల మందికి 1,215 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయిస్తూ జీవో సైతం జారీ చేసింది. అందులో ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వారికి కేటాయింపు జరిగింది. ఇక, ఇప్పుడు హైకోర్టు ఈ జీవోపైనే స్టే ఇవ్వటంతో ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఉన్న ఈ 51 వేలమందికి ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఇళ్ల పధకం పైన ఎఫెక్ట్ పడుతుందా..
అయితే, ఇది తుది తీర్పు కాకపోవటంతో అప్పటి వరకు ప్రభుత్వం ఎదురు చూసే అవకాశం ఉంది. అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలించాలనే ప్రతిపాదనలో భాగంగానే..ఈ ప్రాంతంలో ఇళ్ళ స్థలాలు కేటాయించి 51 వేల కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వగలిగితే ఈ ప్రాంతం అభివృద్ధి వేగంగా ముందుకెళ్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది రాజధాని గ్రామాల్లో తెనాలి, పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాల లబ్ధిదారులకు స్థలాలు కేటాయించాలని భావించింది. ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల పైన ప్రభుత్వం ఏ రకంగా న్యాయ పరమైన అడ్డుకుంలు తొలిగించుకోవటానికి ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications