మురళీ మోహన్ కొడుకు ఇంట్లో మరోసారి చోరీ, ఖరీదైన టీవి..
హైదరాబాద్: రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ తనయుడు రామ్మోహన్ ఇంట్లో మరోసారి చోరీ జరిగింది. ఆయన ఇంట్లో చోరీ జరగడం వారంలో రెండుసార్లు కావడం గమనార్హం. ఆయన ఇంటి నుండి ఖరీదైన టీవీని అగంతకులు దొంగిలించారు.
శనివారం నాడు రామ్మోహన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు పలువురిని విచారించారు.
కాగా, ఇటీవలే మురళీ మోహన్ కుటుంబ స్నేహితురాలు శ్రీలంక నుండి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చి, రామ్మోహన్ ఇంట్లో బస చేశారు. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగులోని రూ.6 లక్షల విలువైన నగలు, విదేశీ కరెన్సీ చోరీ జరిగింది. శ్రీలంక దేశానికి చెందిన యువతి నాచియాకు చెందిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

మొత్తం ఆరు లక్షల విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్లు ఆదివారం రామ్మోహన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం - రామ్మోహన్ స్నేహితురాలు శ్రీలంకకు చెందిన నాచియా అనే యువతి ఓ వివాహానికి హాజరయ్యేందుకు జనవరి 28న హైదరాబాద్కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఫిలింనగర్లోని స్నేహితుడైన రామ్మోహన్ ఇంట్లో ఉంటున్నారు.
వివాహ వేడుకలు ముగియడంతో ఆమె ఆదివారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తన వస్తువులు సర్దుతుండగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఇంట్లో ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ విచారణ జరుగుతుండగానే మళ్లీ చోరీ జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications