అంతా అయ్యాక: కిరణ్ రెడ్డి సస్పెన్స్పై నేతలు అప్సెట్
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు నేతలకు అంతుబట్టడం లేదు. కిరణ్ కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు చాలామంది నిరీక్షిస్తున్నారు. తెలంగాణపై అధిష్టానం ముందుకే వెళ్తే పార్టీ పెడతానని కిరణ్ పరోక్షంగానైనా తమకు సంకేతాలు ఇస్తే బాగుండేదని పలువురు నేతలు భావిస్తున్నారు. కిరణ్ కొత్త పార్టీ అంశంపై పలువురు నేతలు ఆయన తీరుపై అప్ సెట్ అయ్యారట.
ఈ నెల 23వ తేదీ తర్వాత అందరం చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుదామని కిరణ్ ఇటీవల సీమాంధ్ర నేతలతో చెప్పారు. దీంతో పలువురు ఆయన కొత్త పార్టీ పెడతారనే నమ్మకంతో ఉన్నారు. అందుకే వారు ఆయన చెప్పినట్లుగా మరో ఇరవై అయిదు రోజులు నిరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నారు. కొందరు మాత్రం ఆయన తీరు పట్ల అసంతృప్తితో ఉన్నారట.

ఈ నెల 23వ తేదీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని కిరణ్ చెబుతున్నారే తప్ప అధిష్టానం ముందుకెళ్లినా బయటకెళ్దామని మాత్రం చెప్పడం లేదని, చివరి నిమిషంలో తనకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని చెబితే అప్పుడు తాము ఎటూ కాని వారమవుతామని పలువురు ఆవేదన చెందుతున్నారట.
కొన్ని పార్టీల నుండి తమకు ఆహ్వానం వస్తోందని, తాము ఇప్పుడు వెళ్లకుంటే మరొకరికి ఆ అవకాశం ఉంటుందని, కిరణ్ ఎటూ తేల్చక పోవడం వల్ల తాము ఏం తేల్చుకోలేకపోతున్నామని కొందరు ఆందోళన చెందుతున్నారంటున్నారు. ఆయన కోసం నిరీక్షించినా.. చివరి నిమిషంలో పార్టీ మారే ఉద్దేశ్యం లేదని చెబుతే తమ పరిస్థితి గందరగోళంగా తయారవుతుందనే ఆలోచనలో పడ్డారట.
అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసన సభ్యులు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి పలుమార్లు కిరణ్ను కలిసి ఆయన ప్లాన్ ఏమిటో తెలుసుకోవాలని విఫలయత్నం చేశారంటున్నారు. కిరణ్ నుండి స్పందన లేకపోవడంతో జెసి ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.
మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేష్లు కూడా ఈ కారణంగానే టిడిపి వైపు చూస్తున్నారని చెబుతున్నారు. వారు టిడిపిలోకి వెళ్లేందుకు దాదాపు సిద్ధమయ్యారంటున్నారు. పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని, అంతా అయిపోయాక కిరణ్ కొత్త పార్టీ ప్రకటించినా ఉపయోగమేమి ఉండదని అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ వ్యతిరేకించినా అధిష్టానం విభజనకే మొగ్గు చూపితే తాను తీవ్ర నిర్ణయం తీసుకుంటానని కిరణ్ సంకేతాలిస్తే బాగుంటుందని, విభజన నిర్ణయం నేపథ్యంలో నలుగురైదుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మినహా సీమాంధ్ర కాంగ్రసు ఖాళీ అవుతుందని అంటున్నారు. మరోవైపు మంత్రులు కొండ్రు మురళి, తోట నర్సింహం తదితరులు మాత్రం తాము విభజనకు వ్యతిరేకమని అయితే, కాంగ్రెసు పార్టీకి దూరమయ్యే ప్రసక్తే లేదని చెబుతున్నారు.
పార్టీ పెడతారా?
కిరణ్ సొంత పార్టీ పెడతారా? పెట్టరా? సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మదిని తొలి చేస్తున్న సందేహమిది. కిరణ్ సొంత పార్టీపై సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, హర్ష కుమార్ తదితరులు కలిశారు. వారితో పాటు మాజీ మంత్రి ఆదాల ప్రభాకర రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డితో సహా మరికొందరు కూడా సీఎంతో భేటీ అయ్యారు.
ఈ సమయంలో ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి హామీ లభించనప్పటికీ ఎంపీలు మాత్రం కిరణ్ రాజకీయ పార్టీని స్థాపించడం ఖాయమన్న భావనలో ఉన్నారు. కిరణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సమైక్యవాదంతో ముందుకు వెళ్తారని నమ్మకంతో ఉన్నారట. జనవరి 23 తర్వాత కిరణ్ కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. తనను కలుస్తున్న సీమాంధ్ర నేతలు ఏం చేద్దామని ప్రశ్నిస్తే.. కిరణ్ 23 వరకు ఓపిక పట్టాలని సూచిస్తున్నారట.












Click it and Unblock the Notifications