ఏపీకి తుఫాన్ ముప్పు- భారీ వర్షాల వేళ..
Heavy rains: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ పలుచోట్ల వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి- గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అటు విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.
ఈ పరిస్థితుల మధ్య ఏపీకి తుఫాన్ ముప్పు పొంచివుంది. ఈ నెల 24వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడటానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఈ నెల 24న బంగాళాఖాతంలో మరో ఉపరితల ద్రోణి ఏర్పడుతుందని, ఇది క్రమంగా 26వ తేదీ నాటికి అల్పపీడనంగా అనంతరం వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం అంచనావేసింది. ఈ వాయుగుండం 27వ తేదీ నాటికి తుఫాన్ గా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదు. అదే రోజు పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని చెప్పారు.
కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications